రూ. 2.5 కోట్ల పెయింటింగ్ మర్చిపోయాడు!

by  |
రూ. 2.5 కోట్ల పెయింటింగ్ మర్చిపోయాడు!
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రెండున్నర కోట్ల రూపాయల విలువ చేసే పెయింటింగ్‌ను మరిచిపోయాడు ఓ వ్యక్తి. జర్మనీలోని డస్సెల్‌డోర్ఫ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ చెక్ ఇన్ కౌంటర్‌లో గల కార్డుబోర్డ్ బాక్స్‌లో ఓ వ్యాపారవేత్త ప్యాక్ చేసిన పెయింటింగ్‌ను మరిచిపోయాడు. అయితే ఆ పెయింటింగ్‌ను ఫ్రెంచ్ సర్రియలిస్ట్, గ్రేట్ పెయింటర్ అయిన యెస్ తంగై వేయడం విశేషం.

సర్రియలిజం అనేది పెయింటింగ్‌లో ఓ స్టైల్. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో యూరోప్ సాంస్కృతిక పరిస్థితుల నేపథ్యంలో ఈ శైలి పెయింటింగ్ వెలుగులోకి వచ్చింది. ఇందులోని ఆర్ట్ వర్క్ ఊహాత్మక ధోరణిలో వేస్తారు. రైటింగ్ స్టైల్, బొమ్మల చిత్రీకరణ పక్క పక్కనే ఉంటుంది. రెండు వస్తువుల మధ్య సారుప్యత లేదా తేడాను గమనించేలా అత్యద్భుతంగా ఈ దృశ్యాలను ఆవిష్కరిస్తారు. అలాంటి ఓ అరుదైన పెయింటింగ్‌ను ఎయిర్‌పోర్ట్‌లో మరిచిపోయినట్లుగా ఇజ్రాయిల్ టెలిఅవివ్ సిటీలో ల్యాండ్ అయ్యాక ఆ బిజినెస్‌మ్యాన్ తెలుసుకున్నాడు. వెంటనే డస్సెల్‌డోర్ఫ్ పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. 16×24 సెంటిమీటర్ల పెయింటింగ్‌ను తాను ఎయిర్‌పోర్ట్‌లో మరిచిపోయానని, వెతికి ఇవ్వాలని సదరు ఫిర్యాదులో కోరాడు.

విచారణ ప్రారంభించిన పోలీసులకు అది మొదట్లో దొరకలేదు. తాజాగా సదరు బిజినెస్‌మ్యాన్ అల్లుడు బెల్జియం నుంచి వచ్చి పెయింటింగ్ ఎయిర్‌పోర్ట్ ఆవరణలో మిస్సయిందని, ఎంక్వైరీ చేసి కనుగొనాలని కోరాడు. కేసును టేకప్ చేసిన ఇన్‌స్పెక్టర్ మైకెల్.. ఎయిర్‌పోర్ట్ క్లీనింగ్ కంపెనీ ప్రాపర్టీ మేనేజర్‌తో కలిసి ఆవరణలో క్షుణ్ణంగా పరిశీలించారు. రీసైక్లింగ్ కంటెయినర్ల వద్ద వెతికారు. రీసైక్లింగ్ బిన్ (‌డంప్ యార్డ్) కూల్చివేసి చూడగా.. దాని కింద వారికి పెయింటింగ్ దొరికింది. పోలీసులు నిజంగా పరిశోధన చేసి మరీ ఈ పెయింటింగ్ పట్టుకున్నారని, ఇది గొప్ప విషయమని, డిటెక్టివ్ వర్క్ చేశారని పోలీసు అధికారి ఆండ్రె హర్ట్‌విగ్ ఇన్‌స్పెక్టర్ మైకెల్ డిఇట్జ్, ఆఫీసర్లను అభినందించారు.



Next Story