ప్లాస్టిక్‌పై బెజవాడలో ర్యాలీ

by  |
ప్లాస్టిక్‌పై బెజవాడలో ర్యాలీ
X

ప్లాస్టిక్ నిర్మూలనపై చైతన్యం తెచ్చేందుకు కృష్ణా జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ప్లాస్టిక్‌ను నిర్మూలిద్దాం.. భావితరాల భవిష్యత్తు నిర్మిద్దాం అన్న నినాదంతో విజయవాడలోని రామవరప్పాడు రింగు రోడ్డు నుంచి ప్రసాదం పాడు వరకు కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్ ఉద్యోగులు, స్థానిక నేతలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు, గ్రామవలంటీర్లంతా కలిసి ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీలో పర్యావరణాన్ని కాపాడుకుందాం.. సామాజిక బాధ్యతతో సమాజానికి మంచిచేద్దామన్న నినాదాలు హోరెత్తాయి. అనంతరం మన కృష్ణా… ప్లాస్టిక్ రహిత కృష్ణా ర్యాలీనుద్దేశించి కలెక్టర్ ఇంతియాజ్, మాట్లాడుతూ, కృష్ణా జిల్లాలోని 49 మండలాల్లో 18 మండలాల్లో ఈ కార్యక్రమం ఆరంభమైందన్నారు. ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కృష్ణా, గోదావరి నది పరివాహక శుద్ధీకరణ వైస్ ఛైర్మన్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ, కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తపన పడుతున్నారని అన్నారు.

కృష్ణ, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలోని సుమారు 7 వేల కిలోమీటర్ల నది పరివాహక ప్రాంతంతో పాటు కాలువలను కూడా పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని సూచించారు. నదీ పరివాహక ప్రాంతాలను కాలుష్య రహితంగా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన తెలిపారు. కృష్ణా గోదావరి నది పరివాహక ప్రాంత శుద్దికరణ కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించడమే దీనిపై ఆయన ఎంత చిత్తశుద్ధితో ఉన్నారో తెలుపుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాలువలు, నదులను పరిశుభ్రంగా ఉంచడం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించడం ద్వారా నదీపరివాహక ప్రాంతాలు పరిశుభ్రంగా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed