డెలివరీ సేవలు నిలిపేస్తామంటున్న జొమాటో.. ఎప్పటినుంచంటే ?

by  |
zomato
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సంస్థ సెప్టెంబర్ 17 నుంచి కిరాణా డెలివరీ సేవలను నిలిపేయాలని నిర్ణయించింది. ఆర్డర్లు అనుకున్న స్థాయిలో లేకపోవడం, వినియోగదారుల నుంచి సరైన స్పందన కరువవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, మరో కిరాణా సరుకుల డెలివరీ సంస్థ గ్రోఫర్స్‌లో జొమాటోకు పెట్టుబడులు ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా సంస్థ షేర్ హోల్డర్లకు రాబడులు ఉంటాయని నమ్ముతున్నట్టు కంపెనీ అభిప్రాయపడింది. ‘జొమాటో ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ డెలివరీ సేవలను, వ్యాపార భాగస్వాములకు అధిక వృద్ధి అవకాశాలను ఇవ్వాలని ఆశించాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ప్రస్తుత వ్యూహంతో భాగస్వాములతో పాటు వినియోగదారులకు కూడా సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయాం.

ఈ కారణంతో సెప్టెంబర్ 17 నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా ఉన్న జొమాటో కిరాణా డెలివరీ సేవలను నిలిపేస్తున్నామని’ సంస్థ కిరాణా విభాగంలోని భాగస్వాములకు మెయిల్ ద్వారా స్పష్టం చేసింది. కిరాణా డెలివరీ ప్లాట్‌ఫామ్ గ్రోఫర్స్‌లో మైనారిటీ వాటా కోసం జొమాటో సంస్థ దాదాపు రూ. 745 కోట్ల పెట్టుబడులు పెట్టినట్టు కంపెనీ పేర్కొంది. జొమాటో సంస్థ తన వినియోగదారులకు 45 నిమిషాల్లో కిరాణా సరుకులను డెలివరీలను అందించేందుకు ఈ ఏడాది జూలైలో పైలట్ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Next Story