దడ పుట్టిస్తున్న ‘జీరో’

by  |
దడ పుట్టిస్తున్న ‘జీరో’
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ వింత ప్రచారం ప్రజలను పరుగులు పెట్టిస్తోంది. తెల్లారే సరికి ఆఫీసుల ముందు క్యూ కట్టిస్తోంది. ఒక్కరు కాదు.. ఒక్క ప్రాంతం కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పడు ఇదే హాట్ న్యూస్‌గా మారి అధికారులను తీవ్ర ఇబ్బందుల పాలుజేస్తోంది. ఇంతకీ ఏంటి ఆ పుకారు.. జనం ఎందుకు ఎగపడుతున్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..!

పోస్టాఫీస్‌లో జీరో అకౌంట్ తెరిస్తే ప్రభుత్వం డబ్బులు వేస్తుందని గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మెట్రో నగరం హైదరాబాద్‌లోనూ దీనిపై విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో దినసరి కూలీలు, మధ్య తరగతి ప్రజలు ఆయా పట్టణ ప్రాంతాల్లోని పోస్టాఫీస్‌ల వద్ద ఉదయం 7 గంటల నుంచే క్యూ కట్టడం ప్రారంభించారు. ఇలా రోజుకు ఒక్కో పోస్టాపీస్ ఎదుట 200 మంది వరకు లైన్ కట్టడంతో అధికారులు హడలిపోతున్నారు. క్యూ లైన్‌లో కనీసం సోషల్ డిస్టెన్స్ పాటించక పోవడంతో కొవిడ్-19 వ్యాప్తి చెందే అవకాశం ఉందని పోస్టల్ అధికారులు ఆందోళన చెందుతున్నారు.

పోస్టాఫీస్‌లో జీరో అకౌంట్ తీస్తే కేంద్ర ప్రభుత్వం వారి ఖాతాలో రూ.5000లు వేస్తుందని ప్రచారం జరగడంతోనే తాము ఖాతా తెరవడానికి వస్తున్నామని మహిళలు పేర్కొంటున్నారు. అయితే ఇది అబద్దం అని అధికారులు చెబుతున్నారని వాపోతున్నారు. ఏది నిజమో తెలుసుకోలేక పోతున్నామని మహిళలు అంటున్నారు. అయితే ఈ పుకారును ఎవరు చేశారో తెలియదు.. కానీ ప్రజలు పనులు మానుకోని పోస్టాఫీసుల ఎదుట పడిగాపులు కాయడం నేటికీ ఆపడం లేదు. ఇలా జులై నుంచి పోస్టాఫీస్‌ల వద్దకు వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇలాంటి వారి కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

జీరో అకౌంట్‌ తెరిస్తే డబ్బులు పడుతాయన్నది కేవలం పుకారు మాత్రమే అని పోస్టల్ అధికారులు తేల్చేశారు. దీనిపై తనకు ఎలాంటి ఉత్తర్వులు, ఆదేశాలు రాలేదని వివరించారు. ఐపీపీబీ కింది ప్రతి ఒక్కరూ రూ.100లతో ఖాతా తెరిచి పొదుపు చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. అసత్య ప్రచారాలను నమ్మి ప్రజల తమ సమయాన్ని, డబ్బులను వృథా చేసుకోవద్దని సూచిస్తున్నారు.



Next Story

Most Viewed