‘మిస్టర్ ఇండియా’ సీక్వెల్ రెడీ

by  |
‘మిస్టర్ ఇండియా’ సీక్వెల్ రెడీ
X

మిస్టర్ ఇండియా.. బాలీవుడ్ ఐకానిక్ మూవీ. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ సినిమా 30 ఏళ్ల క్రితం వచ్చింది. కానీ, అందులో ఉన్న కంటెంట్‌ను ఇప్పటికీ కొత్తగానే ఆస్వాదిస్తున్నారు అభిమానులు. శేఖర్ కపూర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న మిస్టర్ ఇండియా చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు అనిల్ కపూర్. అందాల తార శ్రీదేవి, అమ్రిష్ పురి ప్రధాన పాత్రల్లో నటించారు. అనాథ పిల్లలతో కలిసి జీవించే అరుణ్‌ గ్యాంగ్‌స్టర్ వేధింపులు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలోనే తనతో ఉన్న పిల్లల్లో ఒకరిని కోల్పోతాడు. దీంతో అరుణ్ తన తండ్రి తయారు చేసిన అదృశ్య గడియారంతో గ్యాంగ్‌స్టర్‌ ఆట ఎలా కట్టించాడు అనేది స్టోరీ.

ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్‌గా రాబోతోంది మిస్టర్ ఇండియా 2. జీ స్టూడియోస్ నిర్మాణంలో రాబోతున్న చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించనున్నారు. సల్మాన్ ఖాన్ హీరోగా నటించి భరత్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ అలీ అబ్బాస్‌కు ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ కాగా.. స్క్రిప్ట్ పకడ్బందీగా రాసుకుంటున్నాడట. అయితే ఈ సినిమాకు టైటిల్ రోల్‌లో రణ్‌వీర్ సింగ్ అయితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు సినీ అభిమానులు. కానీ డైరెక్టర్ పూర్తిగా కథ రాసుకున్నాకే నటీనటుల ఎంపిక ఉంటుందని తెలుస్తోంది.


Next Story