ముంబైలో చిక్కుకున్న జంపా, రిచర్డ్‌సన్

by  |
ముంబైలో చిక్కుకున్న జంపా, రిచర్డ్‌సన్
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌ను వదలి స్వదేశానికి వెళ్లాలని బయోబబుల్ నుంచి బయటకు వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆటగాళ్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్‌సన్ ముంబైలో చిక్కుకున్నారు. రాయల్ చాలెంజర్స్ జట్టు మొత్తం తర్వాతి లెగ్ మ్యాచ్‌ల కోసం అహ్మదాబాద్ వెళ్లిపోయినా.. వీరిద్దరు మాత్రం ముంబైలో ఉండిపోయారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇండియా నుంచి వచ్చే విమానాలపై తాత్కాలిక నిషేధం విధించడంతో వీరి ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా వారి ప్రభుత్వంతో సంప్రదింపులు మొదలు పెట్టింది.

ఒక వేళ ప్రభుత్వం అనుమతిస్తే వారి కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. అనుమతించక పోతే మాత్రం మే 15 వరకు వారిద్దరూ ముంబైలోనే ఉండాల్సి వస్తుందని సమాచారం. ఆస్ట్రేలియా క్రికెటర్స్ అసోసియేషన్, ఇప్పటికే ఆస్ట్రేలియా విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నది. వారి ప్రయాణానికి అనుమతి లభిస్తే దోహా నుంచి విమానాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉన్నది. ఆండ్రూ టై కూడా దోహా మీదుగా ఆస్ట్రేలియా చేరుకున్నాడు.

Next Story