ఆ రోజు గుర్తుంది యూసుఫ్ పఠాన్ భావోద్వేగ ట్వీట్.. క్రికెట్‌కు గుడ్ బై

by  |
ఆ రోజు గుర్తుంది యూసుఫ్ పఠాన్ భావోద్వేగ ట్వీట్.. క్రికెట్‌కు గుడ్ బై
X

గాంధీనగర్: టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు శుక్రవారం వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ సందర్భంగా తన క్రికెట్‌ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ ట్విట్టర్‌లో భావోద్వేగ పూరితమైన లేఖను పోస్ట్ చేశాడు. ‘నేను టీమ్ ఇండియా జెర్సీని మొదటిసారి ధరించిన రోజు ఇప్పటికీ గుర్తుంది. ఆ జెర్సీతోపాటు నా కుటుంబం, కోచ్‌, స్నేహితులు, భారతీయులందరి అంచనాలనూ నా భుజాలపై మోసాను. చిన్నప్పట్నుంచీ నా జీవితమంతా క్రికెట్ చుట్టే తిరిగింది. ఐపీఎల్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌ ఆడిన నేను, నేటితో నా కెరీర్ ఇన్నింగ్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టనున్నాను. ఇందులో భాగంగా క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకూ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. నా క్రికెట్ ప్రయాణంలో నన్ను ఎంతగానో ప్రోత్సహించిన కుటుంబం, స్నేహితులు, అభిమానులు, కోచ్‌లు, దేశం మొత్తానికీ ధన్యవాదాలు. భవిష్యత్తులోనూ ఇలానే ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను.

వరల్డ్ కప్ గెలవడం, సచిన్ టెండుల్కర్‌ని భుజాలపై ఎత్తుకోవడం నా కెరీర్‌లో మర్చిపోలేని అనుభూతులు’ అని పేర్కొన్నాడు. కాగా, టీమ్ ఇండియా తరఫున 57 వన్డేలు, 22 టీ20లు ఆడిన యూసుఫ్, 1,046 పరుగులు చేసి, 46 వికెట్లు తీశాడు. 2007, 2011 ప్రపంచకప్‌లు గెలిచిన భారత జట్టులో యూసుఫ్ సభ్యుడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌, కోల్‌కతా తరఫున ప్రాతినిధ్యం వహించిన యూసుఫ్, రెండు జట్లు ఛాంపియన్‌గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో 174 మ్యాచ్‌లు ఆడి, 3,204 పరుగులు, 42 వికెట్ల ప్రదర్శన చేశాడు. చివరి రెండు సీజన్లలో ఏ జట్టూ కొనుగోలు చేయకపోవడంతో దేశవాళీలో బరోడా తరఫున ప్రాతినిధ్యం వహించాడు.



Next Story

Most Viewed