అఖిల ప్రియ నిరూపిస్తే.. కర్నూలు సెంటర్‌లో ఉరేసుకుంటా: ఎమ్మెల్యే

by  |
అఖిల ప్రియ నిరూపిస్తే.. కర్నూలు సెంటర్‌లో ఉరేసుకుంటా: ఎమ్మెల్యే
X

కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వ్యాపించడానికి కారణం తానేనని టీడీపీ నేత భూమా అఖిల ప్రియ నిరూపిస్తే కర్నూలు నగరం నడిబొడ్డున ఉరేసుకుంటానని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ సవాల్ విసిరారు. కర్నూలు కరోనా వైరస్ కాక పుట్టిస్తోంది. కరోనాకి కారణం వైఎస్సార్సీపీ అని టీడీపీ ఆరోపిస్తుంటే.. కరోనా సమయంలో కూడా రాజకీయ ప్రయోజనాలేనా? అంటూ వైఎస్సార్సీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్య మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.

హఫీజ్ ఖాన్, అఖిలప్రియ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అఖిలప్రియ ఆరోపణల్లో వాస్తవం లేదని హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు అందరి కంటే ముందు వరుసలో నిలిచానని అన్నారు. కరోనా ప్రబలుతుందని భావించి మసీదులను మూసివేయించానని, తబ్లిగీ జమాత్ నుంచి వచ్చిన వారి ఇంటింటికీ వెళ్లి వారిని క్వారంటైన్ కేంద్రాలకు తీసుకెళ్లానని ఆయన వెల్లడించారు. కర్నూలులో కరోనా కట్టడి కోసం శాసనసభ సభ్యుడిగా తాను ప్రతి చర్య చేపడుతున్నానని ఆయన తెలిపారు.

తమ పార్టీ అధినేత చంద్రబాబు మెప్పుకోసమే అఖిలప్రియ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని హఫీజ్ విమర్శించారు. ఆమె అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అసలు ఆమెకు జిల్లా సమస్యలు తెలుసా? అని ఎద్దేవా చేశారు. విపత్కర పరిస్థితుల్లో, మానవత్వం వెల్లి విరియాల్సిన పరిస్థితుల్లో రాజకీయ ప్రయోజనాల కోసం అవాకులు చవాకులు మాట్లాడడం తగదని ఆయన హితవు పలికారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే కర్నూలు సెంటర్ లో ఉరి వేసుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే చంద్రబాబు, నారా లోకేశ్ హైదరాబాదులో కూర్చొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

కాగా, వీడియో సందేశం ద్వారా కర్నూలులో కరోనా ప్రబలడానికి కారణం శాసనసభ్యుడేనని నిన్న అఖిల ప్రియ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కర్నూలు న్యాయరాజధానిలా లేదని కరోనా రాజధానిలా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

tags:coronavirus, kurnool district, politics, tdp,ysrcp, bhuma akhila priya, hafeez khan, ysrcp mla

Next Story

Most Viewed