స్టేట్, సెంట్రల్లో వైసీపీ ప్రమాణాల పండుగ

by  |
స్టేట్, సెంట్రల్లో వైసీపీ ప్రమాణాల పండుగ
X

దిశ, ఏపీబ్యూరో :
వైఎస్సార్ పార్టీలో ప్రమాణ స్వీకారాల పండుగ జరిగింది. రాష్ట్రంతో పాటు కేంద్రంలో కూడా వైఎస్సార్సీపీ నేతలు ప్రమాణ స్వీకారాలు చేయడం ఆ పార్టీ నైతిక బలాన్ని పెంచుతోంది. అధికారపార్టీ తాజాగా మంత్రి వర్గ విస్తరణ చేపట్టడంతో.. సిదిరి అప్పల రాజు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణలు మంత్రి పదవులు దక్కించుకున్నారు. తమ మంత్రి పదవులకు రాజీనామా చేసి ఆ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావుల స్థానాలు బుధవారం భర్తీ అయ్యాయి. విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఈ రోజు మధ్యాహ్నం వారిద్దరితో మంత్రులుగా గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ తదితరులు హాజరయ్యారు.

శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు 1980లో వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ అనే గ్రామంలో జన్మించారు. మత్స్యకార కుటుంబానికి చెందిన అప్పల రాజు విశాఖ జిల్లా సింహాచలంలోని ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో పదో తరగతి వరకు చదివారు. రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపినందుకుగాను.. ప్రతిభా అవార్డును అప్పటి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకున్నారు. వైజాగ్‌లోనే ఇంటర్ పూర్తి చేసిన అప్పలరాజు, ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో విద్యాభ్యాసం గావించారు. ఈ క్రమంలో ఎంబీబీఎస్‌లో రాష్ట్ర స్థాయి గోల్డ్‌మెడల్‌ సాధించారు. ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎండీ(జనరల్‌ మెడిసిన్‌) చదువుకున్నారు. విద్యాభ్యాసం పూర్తి చేయగానే కేజీహెచ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించారు. 2007లో పలాస-కాశీబుగ్గలో ‘సేఫ్‌’ ఆస్పత్రి ఏర్పాటు చేసి ప్రజావైద్యునిగా గుర్తింపు పొందారు. అప్పలరాజు, శ్రీదేవి దంపతులకు అరవ్‌, అర్నవ్‌ అనే ఇద్దరు పిల్లలున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన తొలిసారి పలాస నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సామాజిక సమీకరణాల్లో భాగంగా 2001లో కాంగ్రెస్‌లో రాజోలు నుంచి (స్థానికేతరుడైనా) జెడ్పీటీసీ సీటు లభించింది. 2006లో మలికిపురం నుంచి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2008 నుంచి 2012 వరకు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఉన్నారు. 2014లో కాకినాడ రూరల్‌ నుంచి(స్థానికేతరుడైనా) వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2019లో రామచంద్రపురం నుంచి వైఎస్సార్సీపీ టిక్కెట్‌ను అనూహ్యంగా దక్కించుకుని విజయం సాధించారు. ఇక్కడ నుంచి పోటీ చేయాల్సిన పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ వేరే నియోజకవర్గానికి మారగా, చెల్లుబోయినకు ఆ టికెట్‌ ఖరారైంది. దీంతో ఆయన పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఇప్పుడు బోస్‌ ఖాళీ చేసిన మంత్రి పీఠం ఆయనకు దక్కడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాజ్‌భవన్‌లోకి కొంత మందికి మాత్రమే ప్రవేశం కల్పించారు.

మరోవైపు కేంద్రంలో కూడా వైసీపీ నేతలు ప్రమాణ స్వీకారాలు చేశారు. రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యులతో ఆ సభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ నుంచి ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎంపీలు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హిందీలో ప్రమాణ స్వీకారం చేయగా, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకట రమణారావు తెలుగులో ప్రమాణం చేశారు. మరో సభ్యుడు పరిమళ్‌ నత్వానీ వ్యక్తిగత కారణాల వల్ల ఈ రోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. దీంతో నేడు ముగ్గురే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన మరో రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. కాగా, ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 20 రాష్ట్రాల నుంచి మొత్తం 61 మంది సభ్యులు ఎన్నిక కాగా, వారిలో కొందరు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు.

Next Story

Most Viewed