రేపు వారి అకౌంట్లలో రూ.15 వేలు జమ

by  |
రేపు వారి అకౌంట్లలో రూ.15 వేలు జమ
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం వైఎస్సార్ కాపు నేస్తం. ఈ పథకం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ. 15 వేల చొప్పున ప్రభుత్వం ఆర్దిక సాయం అందిస్తోంది. గురువారం రెండో ఏడాది కాపు నేస్తం నిధులు విడుదల చేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా మహిళల అకౌంట్లో జమచేయనున్నారు. మెుత్తం 3,27,244 మంది పేద అక్కచెల్లెమ్మలకు రూ. 490.86 కోట్ల ఆర్ధిక సాయం చేయనున్నారు. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా 45 నుంచి 60 ఏళ్ళ లోపు ఉన్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన పేద అక్కచెల్లెమ్మలకు ఏటా రూ. 15 వేల చొప్పున 5 ఏళ్ళలో మొత్తం రూ. 75,000 ఆర్దిక సాయం అందిస్తుంది. ఇప్పటి వరకు రెండేళ్లలో ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ. 981.88 కోట్ల లబ్ది చేకూరింది. గత ప్రభుత్వ హయాంలో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు వివిధ రూపాల్లో ఇచ్చింది సగటున ఏడాదికి కేవలం రూ. 400 కోట్లు ఇస్తే తమ ప్రభుత్వం రెండేళ్లలో వివిధ పథకాల ద్వారా 68,95,408 మంది కాపు కులాల అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు దాదాపు 15 రెట్లు ఎక్కువగా రూ. 12,156.10 కోట్ల లబ్ది చేకూర్చినట్లు ప్రభుత్వం తెలిపింది.



Next Story

Most Viewed