షర్మిల పొలిటికల్ ఎంట్రీకి వైఎస్‌ఆర్ అభిమానులు రెడీ

by  |
షర్మిల పొలిటికల్ ఎంట్రీకి వైఎస్‌ఆర్ అభిమానులు రెడీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల తెలంగాణ రాష్ర్ట రాజకీయాల్లో హాట్ టాపిక్ మారారు. కొన్ని రోజులుగా నిత్యం మీటింగులు పెడుతూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ ప్రజలు రాజన్న రాజ్యాన్ని కోరుకుంటున్నారంటు జోస్యం చెబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్టీతో సంబంధం లేదంటూనే కొత్త పార్టీపై మాత్రం అస్సలు మాట్లాడటంలేదు.

వైఎస్ఆర్ అభిమానులంతా తరలారు..

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆయన మరణం తర్వాత షర్మిల చేసిన ఓదార్పు యాత్రలో పాల్గొన్న వారంతా మళ్లీ ఇప్పుడు అటుగా వెళ్తున్నారు. 2014లో ఉన్న ప్రజాదరణను తిరిగి దక్కించుకునేందుకే ఇప్పుడు మళ్లీ ఆమె పాదయాత్ర చేస్తున్నారని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైఎస్ఆర్ పార్టీ నుంచి అప్పట్లో రాజకీయ భవిష్యత్తు కోసం బయటకెళ్లిన నేతలంతా తిరిగి రాజన్న కుటుంబానికి మద్దతుగా పాత గూటికి చేరుకుంటున్నారు.

మద్దతు చూపుతున్న నియోజకవర్గ ప్రముఖులు

రాష్ర్టంలోని వివిధ నియోజకవర్గాల నుంచి నిత్యం వందలాదిగా కార్యకర్తలు లోటస్ పాండ్‌లోని షర్మిల కార్యాలయానికి క్యూ కడుతున్నారు. హైదరాబాద్ పరిధిలోని జవహర్​ నగర్, ఉప్పల్ నియోజకవర్గాల నుంచి దాదాపు 300 మంది తరలివచ్చి మద్దతుగా నిలిచారు. వీరంతా వివిధ పార్టీల్లో నాయకులు, కార్యకర్తలుగా ఉన్నప్పటికీ వైఎస్ఆర్‌తో ఉన్న సంబంధాన్ని గుర్తుంచుకొని షర్మిలతో మేమున్నాం అంటూ నినాదాలు చేస్తున్నారు. దీంతో కార్యాలయ వాతావరణం అంతా జోహార్ వైఎస్ఆర్.. జై షర్మిలమ్మ నినాదాలతో మార్మోగుతోంది.

ఆత్మీయ నాయకుడి కుమార్తె గుర్తుపట్టేలా..

ఓదార్పు యాత్ర సమయంలో షర్మిలకు తోడుగా నిలిచిన ఆయా నియోజకవర్గాలు, మండలాల కార్యకర్తలు ఫొటో క్లిప్పింగులు చూపించి గుర్తు చేస్తున్నారు. ఒకవేళ పార్టీ పెడితే ముందు నుంచే మద్దతు తెలుపుతున్నాం కనుక చోటు కల్పిస్తారని కొందరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ పాదయాత్ర మొదలెడితే మరింత ప్రజాదరణ పొందే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా షర్మిల పార్టీ కావాలని నేషనల్ పార్టీలపై నమ్మకం లేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story

Most Viewed