ఏదో ఒకరోజు తప్పకుండా సీఎం అవుతా: షర్మిల

by  |
ఏదో ఒకరోజు తప్పకుండా సీఎం అవుతా: షర్మిల
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఏదో ఒకరోజు తాను తప్పకుండా సీఎం అవుతానని దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె షర్మిల అన్నారు. ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆమెను లోటస్ పాండ్‎కు తరలించడంతో షర్మిల అక్కడి నుంచే దీక్షను కొనసాగిస్తున్నారు. కార్యకర్తలను విడిచిపెట్టే వరకు మంచి నీళ్లు కూడా ముట్టేది లేదని షర్మిల తెలిపారు. మరోసారి తన మీద చెయ్యి పడితే ఊరుకునేది లేదని షర్మిల పోలీసులను, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేయూ విద్యార్థి సునీల్ నాయక్ ప్రాణానికి విలువ లేదా అని ఆమె ప్రశ్నించారు. కుటుంబంలో ఎవరో ఒకరు చస్తే కానీ.. ఉద్యోగం ఇవ్వరా అని ప్రభుత్వ తీరుపై ఆమె మండిపడ్డారు.

సునీల్ నాయక్ అన్నతో తాను మాట్లాడానని, ఇప్పటి వరకూ ఆ కుటుంబానికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కావాలంటే చెక్ చేసుకోవాలని కేసీఆర్‌కు ఆమె సవాల్ విసిరారు. జులై 8న తాను పార్టీ పెడుతున్నానని, అదేరోజు పాదయాత్ర చేసి తేదీ కూడా ప్రకటిస్తానని ఆమె స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు చూడలేకే పోరాటాలు చేస్తున్నానని పేర్కొన్న ఆమె.. సునీల్ నాయక్ బతకాలని తాను ప్రార్థనలు చేసినట్లు చెప్పారు. యువకులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె కోరారు. బంగారు తెలంగాణ తనతోనే సాధ్యమని, ఏడేళ్లలో కేసీఆర్ చేసిందేం లేదని ఆమె తెలిపారు.


Next Story

Most Viewed