పద్మవ్యూహంలో జగన్! నెగ్గుకొస్తారా.. ఇరుక్కుపోతారా? RRR vs Jagan

by  |
Cm Jagan, MP Raghurama
X

దిశ, ఏపీ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో జగన్ బెయిల్ రద్దు అంశంపైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాజద్రోహం కేసులో తనను అరెస్ట్ చేసి థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపిస్తూ దేశవ్యాప్తంగా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కేంద్రమంత్రులను సైతం కలిశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని.. ఆయన అక్రమాలపై పోరాడుతున్నందుకే తనపై కక్ష సాధింపునకు పాల్పడుతున్నారంటూ ఫిర్యాదు చేస్తున్నారు.

అయితే రఘురామ వ్యూహం వెనుక పెద్ద తతంగమే నడుస్తోందంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. జగన్ బెయిల్ రద్దు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఢిల్లీ కేంద్రంగా రాజకీయం నడుస్తోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీ నేతలు సైతం రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు రఘురామ కృష్ణంరాజు పార్టీ ఎంపీగా ఉంటూ ఎందుకు తిరుగుబాటు చేయాల్సి వచ్చిందో ఓసారి చూద్దాం.

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నరసాపురం లోక్‌సభకు పోటీ చేసి గెలుపొందారు. అయితే పార్టీలో ఇమడలేక ఎంపీగా గెలిచిన ఆయన ఏడాది తిరగకముందే పార్టీపై తిరుగుబాటుకు దిగారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పలు ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. చివరికి పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఆస్తుల కేసులో బెయిల్ రద్దు చేయాలంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఆశ్రయించారు. అంతేకాదు రచ్చబండ పేరుతో వైసీపీపైనా ఆ పార్టీలోని కీలక నేతలపైనా విమర్శలదాడికి దిగారు. అనంతరం ఆయనపై రాజద్రోహం కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

విచారణలో భాగంగా తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారంటూ ఎంపీ రఘురామ నానా హంగామా చేశారు. అనంతరం సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో చికిత్సపొందడం అక్కడ కూడా పలువురుపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆర్మీ అధికారులపైనా, తెలంగాణ పోలీసులను సైతం వదల్లేదు. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన ఆయన తనపై నమోదైన కేసులు, థర్డ్ డిగ్రీ ప్రయోగించడం వంటి అంశాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. తొలుత సహచర ఎంపీలకు లేఖలు రాశారు. తనపై జరిగిన దాడి గురించి వివరించారు. లోక్‌సభలో తనకు సంఘీభావం ప్రకటించాలని కోరారు. అందుకు పలువురు ఎంపీలు సైతం ట్విట్టర్ వేదికగా మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఏపీ సీఎం వైఎస్ జగన్ మినహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి మద్దతు కోరారు.

ఇకపోతే మంగళవారం రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు లేఖలు రాశారు. ఒక పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యను దేశం దృష్టికి తీసుకెళ్లారు. తనపై పోలీసులు దాడి చేశారంటూ పదేపదే ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఆ లేఖల్లో సీఎం జగన్‌పై ఉన్న సీబీఐ కేసుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు కూడా. ఇలా రఘురామకృష్ణంరాజు పార్టీపైనా, ముఖ్యమంత్రిపైనా ఆరోపణలు చేస్తూ లేఖల ఉద్యమాన్ని చేపట్టడంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. రఘురామను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు రఘురామ వెనుక పెద్ద తతంగమే నడుస్తోందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హోంశాఖ మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాలతోపాటు పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. తనపై జరిగిన దాడి గురించి ప్రస్తావిస్తూనే జగన్‌పై సీబీఐ కేసుల గురించి ప్రస్తావిస్తున్నారు.

ఒకప్పుడు పార్టీలో సమస్య, ఆ తర్వాత ప్రభుత్వంపై తిరుగుబాటు, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, తాజాగా తనపై జరిగిన దాడి, మళ్లీ జగన్‌పై సీబీఐ కేసుల వ్యవహారాన్ని తెరపైకి తేవడం చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఒక సమస్యను తీసుకుని చివరకు దాన్ని జగన్‌పై సీబీఐ కేసులు, బెయిల్ రద్దు వంటి అంశాల వరకు తీసుకెళ్లారు. ప్రస్తుతం జగన్ బెయిల్ రద్దు వ్యవహారమే రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. అంతేకాదు జగన్ బెయిల్ రద్దు అంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు కూడా హల్ చల్ చేస్తున్నాయి. మెుత్తానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం వెనుక ఏదైనా రాజకీయకుతంత్రం జరుగుతుందా అన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్‌‌లో జరుగుతుంది. మెుత్తానికి బెయిల్ రద్దు కేంద్రంగా జరుగుతున్న పొలిటికల్ పద్మవ్యూహాం నుంచి జగన్ బయటకొస్తారా లేక ఇరుక్కుపోతారా అనేది కాలమే నిర్ణయించాలి.


Next Story