సీతక్క కోసం యూత్ ఎదురుచూపు.. భారీగా చేరే అవకాశం!

by  |
Congress-party
X

దిశ, మణుగూరు: తెలంగాణ కాంగ్రెస్ బాస్‌గా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్నికైన నాటినుంచి పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బూర్గంపాడు, అశ్వాపురం, పినపాక, బయ్యారం తదితర ప్రాంతాల నుంచి భారీగా ములుగు ఎమ్మెల్యే సీతక్క సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని నియోజకవర్గ కేంద్రంలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో హైదరాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న సీతక్క జిల్లాకు వచ్చిన వెంటనే యూత్ నాయకులు సీతక్క సమక్షంలో చేరి, కాంగ్రెస్‌తో ప్రయాణం చేయబోతున్నారని తెలుస్తోంది.

సుమారు 90 నుండి 100 మంది వరకు నియోజకవర్గ యూత్ నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని పలువురు మేధావులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసమే యూత్ చేరికలు జరుగుతున్నాయని కొందరి ప్రముఖుల వాదన. పినపాకలో కాంగ్రెస్ బలం రోజురోజుకూ పుంజుకోవడంతో టీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేగాకుండా.. స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారవు రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారే అశకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రేవంత్ నాయకత్వంలో పార్టీని వీడిన నాయకులు అందరూ మళ్లీ కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, పార్టీ అధిష్టానం చెబుతోంది. ఏదేమైనా యూత్ నాయకులు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపిస్తే రానున్న రోజుల్లో కాంగ్రెస్ బలం భయంకరంగా పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

రానున్న మూడు, నాలుగు రోజుల్లో సీతక్కను కలవడానికి పినపాక నియోజకవర్గ యూత్ భారీగా ఏర్పాట్లు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికలకు ఇంకా రెండేండ్లు సమయం ఉన్నా.. ఇప్పుడే నియోజకవర్గంపై ఎందుకు అంత చర్చ జరుగుతుందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. గత ఎన్నికల్లో సైతం ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ తన సత్తా చాటింది. ఒక్క ఖమ్మం నియోజకవర్గం తప్ప, మిగిలిన నియోజకవర్గాలన్నీ, కాంగ్రెస్, టీడీపీ మాత్రమే గెలిచాయి. దీంతో మళ్లీ కాంగ్రెస్ పుంజుకుంటే టీఆర్ఎస్‌కు భారీ దెబ్బపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed