కేరళ టు కశ్మీర్.. బుల్లెట్ బండిపై తల్లీకూతుర్లు, సైకిల్‌పై యువతి!

by  |
కేరళ టు కశ్మీర్.. బుల్లెట్ బండిపై తల్లీకూతుర్లు, సైకిల్‌పై యువతి!
X

దిశ, ఫీచర్స్ : జ్ఞాన సముపార్జనకు పుస్తకాలే మార్గం కాదు.. అన్వేషణ, కొత్త ప్రదేశాల పర్యటనలు కూడా ఇందుకు దోహదపడతాయి. మేల్ డామినేటెడ్ సొసైటీలో మహిళలకు ఆ అవకాశం తక్కువే అయినా.. ఇటీవల కాలంలో అమ్మాయిలు ఒంటరిగా రోడ్ ట్రిప్స్‌కు వెళ్తూ స్టీరియోటైప్స్ బ్రేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేరళ, తచ్చన్న గ్రామానికి చెందిన ఓ యువతి, తన ఇద్దరు మిత్రులతో కలిసి సైకిల్‌పై కశ్మీర్ యాత్ర మొదలెట్టింది. కాగా ఇద్దరు పురుషులతో చేస్తున్న ఈ ప్రయాణం.. మారుతున్న సమాజ ధోరణికి, కాలానికి ప్రతీక అంటూ అమ్మాయి తండ్రి అభివర్ణించడం విశేషం.

సకీర్ హుస్సేన్, హఫ్సత్ దంపతుల కుమార్తె సహ్లా. సైకిల్‌పై దేశాన్ని చుట్టేయాలనేది తన చిన్ననాటి కల. ఈ క్రమంలో జర్నలిజం పూర్తి చేసిన 21 ఏళ్ల సహ్లా.. చదువుకుంటున్న క్రమంలో ఆదా చేసిన డబ్బుతో సైకిల్ కొనుక్కుంది. ఈ మేరకు తన లక్ష్యాన్ని తల్లిదండ్రులకు వివరించగా.. వాళ్లు కూడా ప్రోత్సహించారు. దీంతో సైక్లింగ్‌లో అనుభవమున్న మహమ్మద్ షామిల్, మషూర్ షాన్‌తో కలిసి సాహస యాత్రకు బయలుదేరింది.

‘సూర్యాస్తమయం తర్వాత అమ్మాయిలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దనే రోజులు పోయాయి. అమ్మాయిలు అన్ని రంగాల్లోనూ తమదైన సత్తా చూపిస్తున్నారు. ఇది మారుతున్న కాలానికి నిదర్శనం. నా తల్లిదండ్రులు ప్రతి విషయంలోనూ ప్రోత్సాహం అందిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ఇదివరకు కూడా సైకిల్ యాత్ర చేశాను. కానీ సమీపంలోని ప్రాంతాలకే వెళ్లాను. ఇక కశ్మీర్ యాత్ర మాత్రం నా కల. ప్రయాణానికి మూడు నెలలు పడుతుందని భావిస్తున్నాం. కలల గమ్యాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానని ఉత్సాహంతో ఉన్నాను’ అని సహ్లా తెలిపింది.

అబ్బాయిలకైనా, అమ్మాయిలకైనా కోరుకునే స్వేచ్ఛను ఇవ్వాలని, మనం వారిని నిరోధిస్తే వారి విశ్వాసం, ధైర్యం సన్నగిల్లుతుందని సహ్లా తండ్రి అన్నాడు.

బైక్‌పై తళ్లీ కూతుళ్లు :

ఇదిలా ఉంటే, కేరళలోని మణియారాకు చెందిన ఉపాధ్యాయిని అనీష.. తన కూతురు మధురిమతో కలిసి బుల్లెట్‌పై కేరళ నుంచి కశ్మీర్‌ వెళ్తోంది. ఈ నెల 14న బైక్‌ ట్రిప్‌ ప్రారంభించినప్పటికీ కశ్మీర్ కంటే ముందు మైసూర్‌కు ట్రయల్‌ రన్‌ కోసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. బైక్‌పై ప్రతీ రోజు 250 -300 కి.మీ వరకు ప్రయాణం చేస్తున్నట్లు వారు వెల్లడించారు.

mother-and-daughter


Next Story

Most Viewed