విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోవాలి

by Ratna Kumari |

సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని భువనగిరి డీఎస్పీ బి.రవీందర్ సూచించారు.

విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోవాలి
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా విద్యార్థులు సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకోవాలని భువనగిరి డీఎస్పీ బి.రవీందర్ సూచించారు. మంగళవారం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని రాయగిరిలో ఉన్న ఓ ప్రైవేట్ ఫార్మసీ కళాశాలలో నిర్వహించిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. రోజురోజుకూ సైబర్ మోసాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, సోషల్ మీడియా సందేశాలను నమ్మవద్దని సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా సమాచారం, ఏటీఎం కార్డు వివరాలు, ఓటీపీలు వంటి గోప్యమైన సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. ఏదైనా సైబర్ మోసం జరిగినట్లు అనుమానం వచ్చిన వెంటనే 1930 సైబర్ హెల్ప్‌లైన్*కు ఫిర్యాదు చేయడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు, రూరల్ ఎస్‌హెచ్‌ఓ అనిల్‌కుమార్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Next Story