మెట్రో నిర్వహణ కేంద్రాన్ని సందర్శించిన ఎస్‌సీఆర్ జీఎం.. ఆధునిక సాంకేతికతపై సమీక్ష

by Kodari Anjali |

దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ను సందర్శించారు.

మెట్రో నిర్వహణ కేంద్రాన్ని సందర్శించిన ఎస్‌సీఆర్ జీఎం.. ఆధునిక సాంకేతికతపై సమీక్ష
X

దిశ, సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్)ను సందర్శించి మెట్రో నిర్వహణ, భద్రతా ప్రమాణాలు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు. ముందుగా నాగోల్‌లోని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ అడ్మినిస్ట్రేటివ్ భవనంలో హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ ఉన్నతాధికారులతో సమావేశమై మెట్రో రైలు వ్యవస్థ పనితీరు, నిర్వహణ విధానాలు, ప్రయాణికులకు అందిస్తున్న సేవలు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై సమగ్ర ప్రజెంటేషన్‌ను పరిశీలించారు. రైల్వే లెవెల్ క్రాసింగ్‌ల వద్ద చేపట్టనున్న విస్తరణ పనులకు దక్షిణ మధ్య రైల్వే సహకారం కొనసాగించాలని మెట్రో అధికారులు కోరారు. అనంతరం నాగోల్ మెట్రో నిర్వహణ డిపోను సందర్శించి ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్, నిర్వహణ షెడ్లు, కోచ్‌ల తనిఖీ, ఆధునిక నిర్వహణ సాంకేతికత, భద్రతా ప్రమాణాలను పరిశీలించారు. మెట్రో కోచ్‌ల నిర్వహణ విధానాలను నిశితంగా పరిశీలించి అధికారులు అమలు చేస్తున్న సాంకేతిక పద్ధతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ మెట్రో నిర్వహణ ప్రమాణాలను ప్రశంసించిన సంజయ్ కుమార్ శ్రీవాస్తవ, ఆధునిక సాంకేతికతతో సమర్థవంతమైన సేవలు అందిస్తున్న హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎల్ అండ్ టీ మెట్రో అధికారులను అభినందించారు. దక్షిణ మధ్య రైల్వే–హైదరాబాద్ మెట్రో మధ్య కొనసాగుతున్న సమన్వయం భవిష్యత్‌లో మరింత బలోపేతమై, నగర రవాణా వ్యవస్థ అభివృద్ధికి దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు దక్షిణ మధ్య రైల్వే వివిధ శాఖల ప్రధానాధికారులు పాల్గొన్నారు.

Next Story