పోలీసుల వేధింపులకు యువకుడు బలి

by  |
police harassment
X

దిశ, ఏపీ బ్యూరో: తూర్పుగోదావరి జిల్లాలో పోలీసులు వేధిస్తున్నారంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకి పోలీసులే కారణమని సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. తర్వాత ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే రాజమహేంద్రవరం రూరల్ పిడింగొయ్యి ప్రాంతానికి చెందిన మజ్జి, ఏడాది క్రితం తెలంగాణ నుండి రాజమహేంద్రవరంకు రెండు మద్యం బాటిల్స్ తీసుకొస్తూ జగ్గయ్యపేట దగ్గర ఉన్న చిల్లకల్లు పోలీసులకు చిక్కాడు. దాంతో కొంత మొత్తంలో డబ్బు తీసుకుని పోలీసులు మజ్జిని వదిలేశారు. అయితే ఇటీవల కానిస్టేబుల్ శివ ఫోన్ చేసి సెటిల్ చేసుకోకపోతే ఇబ్బంది పడతావు అని బెదిరింపులకు పాల్పడ్డాడు.

దీంతో చిలకల్లు వెళ్లిన బాధితుడికి కానిస్టేబుల్ శివ లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. లేదంటే గంజాయి కేసు పెడతానని బెదిరించాడు. డబ్బు తీసుకువస్తానని చెప్పి శివ పిడింగొయ్యి వచ్చాడు. లక్ష రూపాయలు ఎలా ఇవ్వాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. మరోవైపు పోలీసుల వేధింపులు తీవ్రమవ్వడంతో మనస్తాపంతో ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చేతికందొచ్చిన కొడుకు విగతజీవిగా వేలాడుతుండటం చూసిన తల్లిదండ్రలు కన్నీటి పర్యంతమయ్యారు. తమకు దిక్కెవరంటూ బోరున విలపించారు. మరోవైపు మజ్జి ఆత్మహత్య విషయం తెలుసుకున్న కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్ కానిస్టేబుల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ స్వప్రయోజనం కోసం ఒక యువకుడి నిండు ప్రాణం బలి కావడానికి కారణమైన కానిస్టేబుల్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. అలాగే సిబ్బంది విధుల పట్ల సరైన పర్యవేక్షణ లేదనే కారణంగా చిల్లకల్లు ఎస్సైపై సస్పెన్షన్ వేటు విధిస్తూ ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్ ఉత్తర్వులు జారీ చేశారు.

Next Story

Most Viewed