గ్యాంగ్‌ వార్‌లో ఒకరు మృతి.. సర్పంచ్ ఇంటి ముందు సమాధి(వీడియో)

by  |
గ్యాంగ్‌ వార్‌లో ఒకరు మృతి.. సర్పంచ్ ఇంటి ముందు సమాధి(వీడియో)
X

దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: భక్తి శ్రద్ధలు, సరదాగా జరగాల్సిన వినాయక నిమజ్జనం వేడుకలో ఓ యువకుడి ప్రాణం పోయింది. దీంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు సర్పంచ్ ఇంటి ముందే గోతి తవ్వి అంత్యక్రియలు నిర్వహిస్తామని బైఠాయించారు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కొత్త మొల్గరలో చోటుచేసుకుంది.

పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. కొత్త మొల్గర గ్రామానికి చెందిన పలువురు యువకులు వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి మంగళవారం నిమజ్జనానికి సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తుండగా.. ఇదే గ్రామానికి చెందిన ఎరుకలి మల్లేష్(23) మరో ఇద్దరు యువకులు వచ్చి ఉరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు నిర్వహిస్తున్న యువకులతో ఈ ముగ్గురు యువకులకు రాజకీయ విభేదాలు ఉండడంతో వివాదం జరిగింది. ఊరేగింపు నిర్వహిస్తున్న యువకులు ఎరుకలి మల్లేష్ పై చేయి చేసుకోవడంతో గొడవ మొదలైంది. దాదాపుగా రాత్రి పదిన్నర గంటల సమయంలో జరిగిన ఈ సంఘటనలో మల్లేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాధితుడిని హుటాహుటిన మహబూబ్‌నగర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మల్లేష్ బుధవారం ఉదయం మరణించినట్లుగా ఆస్పత్రి వర్గాలు ధ్రువీకరించాయి.

ఈ విషయం తెలియడంతో కుల సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం పూర్తి అయిన తర్వాత మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు. తమ కుమారుడి చావుకి సర్పంచ్ భర్త, కుమారుడే ప్రధాన కారణమని ఆరోపిస్తూ వారి ఇంటి ముందే మృతదేహాన్ని పూడ్చి పెడతామని.. గోతి తవ్వారు. దీంతో గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భూత్పూర్ సీఐ రజిత, ఎస్సై భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమాచారం అందుకున్న ఆర్డీఓ పద్మశ్రీ సంఘటన స్థలానికి చేరుకొని ప్రభుత్వ పరంగా న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. చివరకు ఆందోళనకారులు మృతదేహాన్ని తమ ఇంటికి తీసుకువెళ్లారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీధర్ ఈ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి అదుపుతప్పకుండా పోలీసులకు పలు సూచనలు చేశారు.

10 మందిపై కేసు నమోదు..

తమ కుమారుడి మరణానికి కారకులుగా పేర్కొంటూ బాధితుడి తండ్రి ఎరుకలి వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు 10 మందిపై కేసు నమోదు చేయడం జరిగిందని సీఐ రజిత తెలిపారు. సర్పంచ్ భర్త నర్సింలు గౌడ్, కుమారుడు ఉదయ్ గౌడ్‌తో పాటు గ్రామానికి చెందిన శేఖర్ గౌడ్, గణేష్ గౌడ్, శ్రీధర్ గౌడ్, నాగరాజ్ గౌడ్, జుట్టు మల్లప్ప, రవీందర్ గౌడ్, సాయి కుమార్ గౌడ్, ప్రకాష్ గౌడ్ పై కేసు నమోదైనట్లు సీఐ తెలిపారు.


Next Story