పార్కింగ్ విషయంలో గొడవ.. గన్ తో యువకుడు హల్చల్

by  |
పార్కింగ్ విషయంలో గొడవ.. గన్ తో యువకుడు హల్చల్
X

దిశ, శేరిలింగంపల్లి: జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఎల్లమ్మబండ వద్ద ఓ యువకుడు గన్ తో హల్చల్ చేశాడు. మంగళవారం రాత్రి 10.30 గంటల తర్వాత స్థానికంగా ఉన్న లాస్య వైన్స్ వద్దకు పోలీస్ సైరన్ వేసుకుంటూ కారులో వచ్చిన సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ హర్షారెడ్డి పార్కింగ్ విషయమై అక్కడే ఉన్న దిలీప్ పవార్ తో గొడవకు దిగాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగి దాడికి దారితీసింది. దీంతో కోపోద్రిక్తుడైన హర్షారెడ్డి తన కారులోని డ్యాష్ బోర్డు నుండి పిస్తల్ తీసి దిలీప్ పవార్ పై గురిపెట్టాడు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్దానికులు కలగజేసుకుని ఇద్దరిని సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం దిలీప్ పవార్ జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు హర్షారెడ్డిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

గన్ తో హల్చల్ చేసిన హర్షారెడ్డికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు పోలీసులు. అతను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమారుడు అని, అతను నగరంలో ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని, హర్షారెడ్డి భార్య సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ అని సమాచారం. అలాగే హర్షారెడ్డికి గన్ ఎక్కడిది? ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? పోలీసు సైరన్ ఎలా ఉపయోగిస్తున్నారు అన్నదానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అతనిపై కేవలం కేసు నమోదు చేశామని మాత్రమే పోలీసులు వెల్లడించారు.


Next Story