సూర్యాపేట జిల్లాలో యువకుడి దారుణ హత్య

by  |
సూర్యాపేట జిల్లాలో యువకుడి దారుణ హత్య
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇద్దరు యువకుల మధ్య జరిగిన చిన్న ఘర్షణ ఒకరి ప్రాణాన్ని తీసింది. మిల్లు ఓనర్‌కు హతుడి కుటుంబానికి మధ్య ఉన్న వివాదంలో తలదూర్చిన యువకుడు జైలు పాలయ్యాడు. క్షణికావేశంలో చేసిన పనికి ఇద్దరు టీనేజ్ యువకుల జీవితాలు బుగ్గిపాలు అయ్యాయి. రెండు వర్గాలు ఘర్షణపడిన ఘటనలో ఒకరి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

గరిడేపల్లి మండలం గడ్డిపల్లి గ్రామానికి చెందిన బొమ్మకంటి అజిత్, సార్ల రాము గతంలో మంచి మిత్రులు. అజిత్ డిగ్రీ చదువుతుండగా.. రాము స్థానికంగా ఓ మిల్లులో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అజిత్ కుటుంబానికి మిల్లు ఓనర్‌కు వివాదాలు ఉన్నాయి. అక్కడే పని చేస్తున్న రాము ఓనర్‌కు మద్దతుగా ఉంటూ అజత్‌కు శత్రువుగా మారారు. కాగా మిల్లు ఓనర్ ఇటీవల అజిత్ బైక్‌ను జేసీబీతో తొక్కించడంతో కేసు నమోదైంది. ఆ కేసుపై రాము పెట్టిన స్టేటస్ వివాదస్పదం కావడంతో ఇద్దరి మధ్య వివాదం ముదిరింది.

ఆదివారం జరిగిన అరబిందో మాత జాతర అనంతరం రాత్రి 11 గంటల తర్వాత అజిత్, రాము రెండు బ్యాచ్‌లుగా విడిపోయి తమ ఫ్రెండ్స్‌తో కలిసి ఘర్షణ పడ్డారు. ఈ దాడిలో రాము.. అజిత్‌ను కత్తితో విచక్షణరహితంగా పొడిచాడు. దీంతో అజిత్ కిందపడిపోయాడు. ఆ సమయంలో అతడిని ఎవరు గుర్తించలేదు. గొడవ అనంతరం ఫ్రెండ్స్ పరిశీలించగా.. అజిత్ అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి.. అక్కడి నుంచి సూర్యాపేటకు తరలించారు. అజిత్ పేగులు బయటపడి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు.

అజిత్ హత్యతో గడ్డిపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో హుజూర్ నగర్ సీఐ రాఘవరావు, గరిడేపల్లి ఎస్ఐ వెంకన్న గౌడ్ సిబ్బందితో గ్రామంలో పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేశారు. నిందితుడు రాము ఇంటిపై దాడి చేసే అవకాశం ఉండడంతో ఆయన ఇంటి చుట్టు పోలీస్ పహారా పెట్టారు. అనంతరం ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ, హత్యకు దారి తీసిన సంఘటనలపై గ్రామస్తులతోపాటు, వారి స్నేహితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా నిందితుడు రాము గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. హతుడు అజిత్ తండ్రి పిచ్చయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story

Most Viewed