బీజేపీ పకోడానామిక్స్‌తోనే బ్యాంకుల సంక్షోభం: కాంగ్రెస్

by  |
బీజేపీ పకోడానామిక్స్‌తోనే బ్యాంకుల సంక్షోభం: కాంగ్రెస్
X

దిశ, వెబ్‌డెస్క్
‘ఎస్ బ్యాంకు సంక్షోభం’ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై శుక్రవారం కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. ఆ పార్టీ తప్పుడు ఆర్థిక విధానాలకు ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఆరోపించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండు చేసింది. ఎస్ బ్యాంకులో కస్టమర్ల లావాదేవీలపై గురువారం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. నెల రోజుల వరకు నగదు ఉపసంహరణ పరిధిని రూ. 50,000లకు కుదించింది. ఈ నిర్ణయం ఎస్ బ్యాంకు వినియోగదారులను భయాందోళనకు గురిచేసింది. ఎస్ బ్యాంకు డైరెక్టర్ల బోర్డును కూడా రద్దు చేసిన ఆర్బీఐ ఒక అడ్మినిస్ట్రేటర్‌ను నియమించింది.

ఎస్‌ బ్యాంకు పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఆ ప్రభుత్వ విధానాలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ఆరేండ్లలో బీజేపీ నినాదాలు ఇవే అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

2014లో ప్రతి భారతీయుడికి రూ. 15 లక్షలు తీసుకో అన్నది ( 15 లాక్ లే లో)
2018లో ప్రతి నిరుద్యోగికి పకోడో తీసుకో అన్నది (పకోడ లే లో )
2020లో ప్రతి బ్యాంకు, పరిశ్రమలకు తాళాలు వేసుకో (తాళా లే లో) అని చెబుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ ప్రభుత్వం పకోడానామిక్స్‌ను పాటిస్తోందని, ప్రస్తుతం అవి పనిచేస్తున్నాయని, ఆ నిర్ణయాలతోనే భారత ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోందని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా స్పందించారు. ఎస్ బ్యాంకు ఒక్కటే కాదు. ప్రధాని నరేంద్ర మోదీ, అతని ప్రభుత్వ నిర్ణయాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం ధ్వంసమవుతోందని విరుచుకుపడ్డారు.

మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం సైతం ట్విట్టర్ వేదికగా బీజేపీపై విరుచుకుపడ్డారు. ‘గత ఆరేండ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. తప్పుడు విధానాలతో ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టింది. మొదట పీఎంసీ బ్యాంకు సంక్షోభంలోకి వెళ్లింది. ప్రస్తుతం ఎస్ బ్యాంక్ వంతు వచ్చింది. మూడో బ్యాంకు కూడా వరుసలో ఉందా?’ అని చిందబరం బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎస్ బ్యాంకు డిపాజిట్ విత్ డ్రాలపై ఆర్బీఐ నిర్ణయాలతో డిపాజిటర్లు ఆందోళనకు లోనవుతున్నారు. డబ్బులను విత్ డ్రా చేసుకోవడం కోసం ఏటీఎం కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. బ్యాంకు సిబ్బంది సరైన సమాచారం ఇవ్వడం లేదని డిపాజిటర్లు ఆరోపిస్తున్నారు. చాలా వరకు ఎస్ బ్యాంకు ఏటీఎంలు పనిచేయడం లేదని సమాచారం. శుక్రవారం ఉదయం ఆ బ్యాంకు షేర్లు 35 శాతం పడిపోయాయి. దశాబ్దకాలంలోనే అతి తక్కువ ధరకు ఆ బ్యాంకు షేర్లు ట్రేడవుతున్నాయి.

Tags : yes bank crisis, congress, yes bank, pakodanomics of bjp government



Next Story