బంగారం దిగొచ్చింది!

by  |
బంగారం దిగొచ్చింది!
X

దిశ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ పరిణామాలతో దేశీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. సోమవారం ఏకంగా ఏడేళ్ల గరిష్టానికి వెళ్లిన బంగారం ఎట్టకేలకు 2 శాతం దిగొచ్చింది. అంతకుముందు సెషన్‌లో పెరుగుతున్న కరోనా వైరస్ మరణాలపై మదుపర్లు ఆందోళన చెందడంతో బంగారం ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. చైనాతో పాటు దక్షిణ కొరియా, ఇటలీ, మధ్య ప్రాచ్య దేశాల్లో కరోనా మరణాలు పెరుగుతుండటంతో ఈక్విటీ మార్కెట్లు నష్టాలను చూస్తున్నాయి. ఈ ప్రభావంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై అనిశ్చితి ఏర్పడింది. దీంతో పెట్టుబడిదారులు బంగారమే సురక్షిత మార్గమని భావిస్తున్నారు. ఈక్విటీ మార్కెట్లు, క్రూడ్ సహా ఇతర విభాగాల నుంచి ఎక్కువమంది బంగారంపై పెట్టుబడికి మొగ్గు చూపుతున్నారు. ట్రేడింగ్‌లో ఔన్స్ బంగారం ఒక దశలో 1,700 డాలర్ల వరకు పెరిగేలా కనబడింది.

మార్కెట్లు నిలకడగా రాణించడంతో మంగళవాం పసిడి ధరలు నెమ్మదించాయి. దేశ రాజధానిలో పది గ్రాముల పసిడి రూ. 954 తగ్గి రూ. 43,549కు చేరుకుంది. రోజు క్రితం బంగారం పది గ్రాములు రూ. 44,503 తో రికార్డు స్థాయి చేరుకున్న సంగతి తెలిసిందే. వెండి సైతం కిలో రూ. 50,070 నుంచి రూ. 80 తగ్గి రూ. 49,990కు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సుకు 1,648 డాలర్లు ఉంది. వెండి ఔన్సుకు 18.40 డాలర్లుగా ట్రేడవుతోంది.

Next Story

Most Viewed