స్టీల్‌ప్లాంట్ కార్మికుల ఛలో పార్లమెంట్‌కు వైసీపీ మద్దతు

by  |
Vijayasaireddy
X

దిశ, ఏపీ బ్యూరో: వర్షాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో స్టీల్‌‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఆగష్టు 2,3 తేదీల్లో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతృత్వంలో ఛలో పార్లమెంట్, జంతర్‌మంతర్‌ వద్ద జరిగే మహాధర్నాకు తమ పార్టీ మద్దతు ఇస్తుందని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలంటూ బుధవారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు బుధవారం ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌తో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విపక్ష నేతల మద్దతుతో పార్లమెంటులో తమ గళం వినిపిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్థిక, ఉక్కుశాఖ మంత్రులను కలిసి కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ప్రయత్నిస్తామన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి తాము వ్యతిరేకమని, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేశామని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయడం సరికాదన్నారు.

నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల్లోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టాలని, స్టీల్‌ప్లాంట్‌ రుణాలను ఈక్విటీగా మార్చాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌కు మైనింగ్‌ను కేటాయిస్తే తక్కువ ధరకు ముడిసరుకు లభిస్తుందని తెలిపారు. జాతి సంపదను ప్రైవేటీకరణ చేయడం సరికాదని మంత్రి అవంతి శ్రీనివాస్‌ సూచించారు. ఢిల్లీలో చేపట్టబోయే నిరసనలకు తమ మద్దతు ఉంటుందని మంత్రి అవంతి శ్రీనివాస్ హామీ ఇచ్చారు.

స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి అండగా నిలుస్తాం: ఎంపీ ఎంవీవీ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపడుతున్న ఉద్యమానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన కార్మికుల ఉద్యమానికి తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్ ఉద్యమానికి మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే రెండుసార్లు ప్రధానికి లేఖ రాశారని చెప్పుకొచ్చారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని గుర్తు చేశారు. అయితే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ హామీ ఇచ్చారు.


Next Story

Most Viewed