హీరో బాలకృష్ణ ఇంటి వద్ద రణరంగం..

by  |
హీరో బాలకృష్ణ ఇంటి వద్ద రణరంగం..
X

దిశ, ఏపీ బ్యూరో: టాలీవుడ్ అగ్రహీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. హిందూపురం పట్టణంలోని డంపింగ్ యార్డు అంశం అటు తెలుగుదేశం, ఇటు వైసీపీల మధ్య అగ్గిరాజేసింది. దీంతో వైసీపీ నేతలు బాలకృష్ణ ఇంటి ముట్టిడికి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు సైతం బాలయ్య ఇంటికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితి చక్కదిద్దడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే నియోజకవర్గం అభివృద్ధిపై అటు టీడీపీ ఇటు వైసీపీల మధ్య వార్ నడుస్తోంది. రెండున్నరేళ్ల పాలనలో వైసీపీ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని టీడీపీ ఆరోపించింది. బాలకృష్ణ ఇంటి వద్దే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. దీంతో అధికార పార్టీ కార్యకర్తలు బాలకృష్ణ ఇంటి ముట్టడికి బయలుదేరారు.

రెండు పార్టీల నేతలు బాలయ్య ఇంటికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో డంపింగ్ యార్డు తరలింపు తప్ప మరో అభివృద్ధి పనిచేయలేదని టీడీపీ పార్లమెంట్ ఇన్‌చార్జీ చంద్రమౌళి విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూపురాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వడంలేదని చంద్రమౌళి ఆరోపించారు. దీంతో చంద్రమౌళికి వైసీపీ ఎమ్మెల్సీ ఇక్బాల్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం బాలయ్య ఇంటి దగ్గరే చర్చించుకుందామంటూ ఇక్బాల్ సవాల్ విసిరారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ ఇక్బాల్ మంగళవారం వైసీపీ నేతలతో కలిసి ర్యాలీగా బాలయ్య ఇంటికి చేరుకున్నారు. అటు టీడీపీ నేతలు సైతం భారీగా చేరుకున్నారు. దీంతో ఇరువర్గాలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకోవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.


Next Story

Most Viewed