చంద్రబాబు ఇంటి వద్ద రణరంగం.. రక్తాలు కారేలా కొట్టుకున్న వైసీపీ, టీడీపీ శ్రేణులు

by  |
చంద్రబాబు ఇంటి వద్ద రణరంగం.. రక్తాలు కారేలా కొట్టుకున్న వైసీపీ, టీడీపీ శ్రేణులు
X

దిశ, ఏపీబ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో భాగంగా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ నేతృత్వంలోని వైసీపీ కార్యకర్తలు.. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి ముట్టడికి వెళ్లారు. చంద్రబాబు ఇంటి వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఇంటి గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ టెన్షన్..

వైసీపీ ఆందోళనతో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అదే సమయంలో పార్టీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్, నాగుల్ మీరా, బుద్ధా వెంకన్న, పట్టాభి రామ్‌లు కూడా చేరుకున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకున్నాయి. రెండు వర్గాల వారిని అదుపు చేసేందుకు భారీగా పోలీసులను మోహరించారు. వైసీపీ కార్యకర్తల నిరసన గురించి తెలిసి టీడీపీ కార్యకర్తలు భారీగా చంద్రబాబు నివాసానికి తరలివస్తున్నారు. వైసీపీ గూండాలు దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంట్లోకి చొరబడిన వారిని అడ్డుకుంటే.. టీడీపీ నేతలపై రాళ్లు విసిరారని మండిపడ్డారు. దాడి చేసిన వైసీపీ నేతలను వదిలేసి.. బాధితులైన టీడీపీ కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలను పోలీసులు తోసేశారని, టీడీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయని ఆరోపించారు.

సొమ్మసిల్లి పడిపోయిన బుద్ధా వెంకన్న

తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇరు వర్గాలు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో పలువురుకు గాయాలయ్యాయి. టీడీపీ నేత తలకు బలంగా గాయాలవ్వడంతో అతడు కిందపడిపోయాడు. ఇదే సమయంలో బుద్దా వెంకన్నపై వైసీపీ నేతలు కర్రలతో దాడి చేశారు. దీంతో బుద్ధా వెంకన్న సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో ఆయన్ను టీడీపీ నేతలు చంద్రబాబు నివాసంలోకి ఎత్తుకుని తీసుకువెళ్లారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.



Next Story

Most Viewed