చికిత్స కోసం యశోదకు.. పబ్లిసిటీ కోసం గాంధీకా..?

by  |
YS Sharrmila
X

దిశ, తెలంగాణ బ్యూరో : పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతున్న చందంగా.. సీఎం కేసీఆర్ తీరు ఉందని, చికిత్స కోసం యశోద ఆసుపత్రికి వెళ్లిన ఆయన పబ్లిసిటీ కోసం గాంధీ ఆసుపత్రికి వెళ్లారని వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. ఇందిరా శోభన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన డ్వాక్రా మహిళలతో శుక్రవారం షర్మిల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలన తీరును ప్రజలంతా గమనిస్తున్నారని ఆమె తెలిపారు.

కరోనా కష్ట కాలంలో మహిళలు తమ కుటుంబ పోషణ కోసం ఇండ్లను, బంగారాన్ని, చివరకు, మంగళ సూత్రాన్ని కూడా తాకట్టు పెట్టి.. దీనస్థితిలో కాలం వెళ్లదీస్తున్నారని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో చికిత్సల కోసం, కుటుంబ పోషణ కోసం డ్వాక్రా మహిళలు రూ.10 వేల కోట్ల రుణాలు తీసుకున్నారని, ఇది గతేడాదితో పోలిస్తే 60 శాతం అధికమని ఆమె చెప్పుకొచ్చారు. ఇప్పుడు వైద్యానికి తోడు, బతికేందుకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆడవాళ్లు అప్పులు చేస్తే గానీ ఇల్లు గడవలేని పరిస్థితి నేడు తెలంగాణలో ఉందని, సంక్షేమం అంటే ఇదేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

మహిళలంటే సీఎం కేసీఆర్ కు ఎప్పుడూ చులకనేనని అందుకే వారికి పదవులు ఇవ్వరని మండిపడ్డారు. ఒకవేళ వాళ్లు తిరగబడితే తెలంగాణ తల్లి సాక్షిగా వారిపై దాడులు చేసి అవమానిస్తారని వాపోయారు. డ్వాక్రా మహిళా సంఘాల రుణాలన్నింటినీ ప్రభుత్వం మాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. తెలంగాణ సీఎస్ కొవిడ్ టెస్టింగ్, వ్యాక్సినేషన్ సిస్టమ్, మెడికల్ సర్వీస్ బాగుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ప్రజలు ఎంత కష్టపడుతున్నారో ముందు తెలుసుకోవాలన్నారు.

పేదలకు కరోనా వైద్యం భారం కావొద్దని ఆరోగ్యశ్రీలో చేర్చాలని విన్నవిస్తున్నా ప్రభుత్వానికి దున్నపోతు మీద వానపడినట్లుగా ఉందని షర్మిల మండిపడ్డారు. తమ ఒత్తిడి తట్టుకోలేక కరోనాను ఆరోగ్యశ్రీలో కాకుండా ఆయుష్మాన్ భారత్ లో చేర్చి చేతులు దులుపుకున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఆయుష్మాన్ భారత్ ఒట్టి దిక్కుమాలిన పథకం అన్న కేసీఆర్.. ఇప్పుడు ఎందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తా..

వైఎస్సార్ హయాంలో ప్రవేశ పెట్టిన అభయహస్తం కో కాంట్రీబ్యూటరీ పథకాన్ని రద్దు చేయడం వల్ల తాము ఎన్నో కష్టాలు పడుతున్నామని, తమ తరపున మీరు ముందుండి పోరాడాలని వైఎస్ షర్మిలను మహిళలు కోరారు. స్పందించిన షర్మిల తెలంగాణలో మహిళలు పడుతున్న బాధలు, ముఖ్యంగా ఒంటరి మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ తనకు తెలుసునన్నారు. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని షర్మిల పిలుపునిచ్చారు. తాను అధికారంలోకి రాగానే అభయహస్తం పథకాన్ని పునరుద్ధరిస్తానని మహిళలకు హామీ ఇచ్చారు. షర్మిల అనుచరురాలు ఇందిరాశోభన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అనిల, సుజన, మంజుల, భాగ్యలక్ష్మి,, రాజేశ్వరి, సునీత, రాణి, చంద్రకళ, సరిత, వనజ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed