అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం వృథా..?

by Ratna Kumari |

ప్రజా అవసరాలను సరిగా అంచనా వేయకుండా చేపట్టిన పలు నిర్మాణాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారడంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనం వృథా..?
X

దిశ, ఖమ్మం కార్పొరేషన్ : ఖమ్మం నగరంలో ప్రజా అవసరాలను సరిగా అంచనా వేయకుండా చేపట్టిన పలు నిర్మాణాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారడంతో కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల ప్రణాళికా లోపాలు, అప్పటి పాలకుల నిర్ణయాల కారణంగా నిర్మించిన పలు ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయని స్థానికులు పేర్కొంటున్నారు.

రూ.50 లక్షలతో నిర్మించిన వీధి వ్యాపారుల ప్రాంగణం ఖాళీ..

నగరంలోని 9వ డివిజన్ రోటరీనగర్‌లో వీధి వ్యాపారుల కోసం సుమారు రూ.50 లక్షల వ్యయంతో ప్రత్యేక ప్రాంగణాన్ని నిర్మించారు. రద్దీ ప్రాంతం కావడంతో వ్యాపారం బాగా సాగుతుందనే అంచనాతో దుకాణాలను కేటాయించారు. ప్రారంభంలో వ్యాపారులు కార్యకలాపాలు ప్రారంభించినప్పటికీ కొనుగోలుదారుల రాక తగ్గడంతో ఒక్కొక్కరుగా దుకాణాలు మూసివేశారు. ప్రస్తుతం ఆ ప్రాంగణం పూర్తిగా ఖాళీగా ఉండటంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రూ.4.50 కోట్ల సమీకృత మార్కెట్ నిర్మాణం అర్ధంతరంగా..

వీడీవోఎస్ కాలనీలో సుమారు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్‌లో నాన్-వెజ్ విభాగం ఆశించిన విధంగా పనిచేయక మూతపడినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇల్లందు రోడ్డులోని ఖానాపురం సమీపంలో మరో సమీకృత ఆధునిక మార్కెట్‌ను రూ.4.50 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. అయితే కొంత నిర్మాణం పూర్తయ్యాక అదనపు నిధుల అవసరం తలెత్తడంతో పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఆ నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోయింది.

విచారణ చేపట్టాలన్న డిమాండ్..

ప్రజాధనంతో చేపట్టిన నిర్మాణాలు వినియోగంలోకి రాకపోవడం, ప్రణాళికా లోపాల వల్ల నిరుపయోగంగా మారడంపై సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టులు రూపొందించడంతో పాటు ఇప్పటికే నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలను ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story