వాహనాల ధరలు మరింత పెరిగే అవకాశం!

by  |
వాహనాల ధరలు మరింత పెరిగే అవకాశం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఆటో పరిశ్రమలో ఇప్పటికే అన్ని కంపెనీలు తమ కార్లు, టూ-వీలర్ వాహనాల ధరలను పలుమార్లు పెంచాయి. ఇన్‌పుట్, విడి భాగాల ఖర్చులు పెరిగాయనే కారణంతో ధరలు పెంపు నిర్ణయం తీసుకున్న కంపెనీలు ఇప్పుడు మరోసారి కార్లు, మోటార్‌సైకిల్ ధరలను 10-20 శాతం మధ్య పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఆటో పరిశ్రమలో టెక్నాలజీ వినియోగం భారీగా పెరిగింది. దీంతో వాహనాల తయారీలో వడే చిప్స్, సెమీ కండక్టర్ల వినియోగం ఎక్కువగా ఉంది.

కొరతను పరిగణలోకి తీసుకుని సెమీ కండక్టర్ల ధరలను పెంచడం వల్ల ఇప్పటికే అధిక సుంకాలతో సవాళ్లను ఎదుర్కొంటున్న కంపెనీలు కోలుకోవడం మరింత క్లిష్టంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నాయి. కొవిడ్ కారణంగా చిప్‌ల తయారీ సంస్థలు చాలావరకు మూతపడ్డాయి. కంపెనీలు తిరిగి ప్రారంభం అవుతున్నప్పటికీ ఆన్‌లైన్, వర్క్ ఫ్రమ్ హోమ్ పరిణామాలతో వీటి డిమాండ్ అత్యధికంగా ఉంది. అందుకు తగిన స్థాయిలో తయారీ చేపట్టడం మరింత ఇబ్బందిగా ఉంది. దీంతో ఆటో కంపెనీలు ఉత్పత్తిని సైతం తగ్గించాయి.

అంతేకాకుండా సెమీ కండక్టర్ల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 20 శాతం వరకు పెంచాలని నిర్ణయించాయి. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి సెమీ కండక్టర్ల ధరలు మరింత ప్రియం కానున్నాయి. వీటిలో చిప్ ధరలు 10 శాతం, ఆటో కంపెనీలు వినియోగించే చిప్‌ల ధరలు 15-20 శాతం పెరుగుతాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్‌పుట్ ఖర్చులు మరింత ఖరీదైనవిగా మారితే వాహనాల ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.



Next Story