విమానంలో మహిళ మృతి.. 13 గంటల ప్రయాణం తర్వాత విచారణ పేరుతో?

by Naga Rani Yarlagadda |

హాంగ్ కాంగ్ నుంచి లండన్ వెళ్తున్న విమానంలో ఒక మహిళ మృతి చెందింది. పదమూడున్నర గంటలు విమానం ఆ మృతదేహంతోనే ప్రయాణించింది.

విమానంలో మహిళ మృతి.. 13 గంటల ప్రయాణం తర్వాత విచారణ పేరుతో?
X

దిశ, వెబ్‌డెస్క్: హాంగ్‌కాంగ్ నుండి లండన్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ (BA32) విమానంలో ఒక కలచివేసే ఘటన వెలుగు చూసింది. 60 ఏళ్ల వయస్సున్న ఒక మహిళా ప్రయాణికురాలు విమానం టేకాఫ్ అయిన గంటకే ప్రాణాలు కోల్పోయారు. అయితే, విమాన నిబంధనల ప్రకారం ప్రయాణికుడు ఇప్పటికే మరణిస్తే దానిని 'మెడికల్ ఎమర్జెన్సీ'గా పరిగణించరు. దీనితో పైలట్లు విమానాన్ని వెనక్కి తిప్పకుండా లేదా వేరే చోట ల్యాండ్ చేయకుండా, తమ 13.5 గంటల ప్రయాణాన్ని లండన్ వైపుకే కొనసాగించారు.

మరణించిన మహిళ మృతదేహాన్ని విమానం వెనుక భాగంలో ఉండే గాలీ (వంట గది వంటి ప్రాంతం) లో ఉంచారు. అయితే, ఆ గాలీ ఫ్లోర్ వేడి (Heated Floor) తో ఉంటుందనే విషయాన్ని సిబ్బంది గమనించలేకపోయారు. ప్రయాణం సాగుతున్న కొద్దీ ఆ వేడి వల్ల మృతదేహం నుండి తీవ్రమైన దుర్వాసన రావడం మొదలైంది. విమానం లండన్‌కు చేరువయ్యే సమయానికి ఆ వాసన క్యాబిన్ అంతటా వ్యాపించి, విమానంలోని 331 మంది ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

విమానం లండన్ హీత్రూ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన వెంటనే పోలీసులు లోపలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. అప్పటివరకు ప్రయాణికులందరినీ సుమారు 45 నిమిషాల పాటు సీట్లలోనే ఉండాలని ఆదేశించారు. ఈ ఘటనపై బ్రిటిష్ ఎయిర్‌వేస్ స్పందిస్తూ.. ఇలాంటి క్లిష్ట సమయంలో తమ సిబ్బంది నిబంధనల ప్రకారమే వ్యవహరించారని, మృతురాలి కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేస్తున్నామని పేర్కొంది. అంతర్జాతీయ విమానయాన సంస్థల (IATA) మార్గదర్శకాల ప్రకారం.. విమాన ప్రయాణంలో ఎవరైనా మరణిస్తే, మృతదేహాన్ని దుప్పటితో కప్పి ఎవరికీ కనిపించని ఖాళీ ప్రదేశంలో ఉంచాలి. ఒకవేళ విమానం పూర్తిగా నిండిపోయి ఉంటే, మృతదేహాన్ని వారి సీట్లోనే ఉంచి బెల్ట్ వేయాల్సి ఉంటుంది. సాధారణంగా విమాన ప్రయాణాల్లో ఇలాంటి మరణాలు చాలా అరుదుగా సంభవిస్తుంటాయి.

Next Story