యుద్ధం ఎఫెక్ట్: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు

by Ramesh Naini |   (  Updated:2026-03-15 07:39:45  IST  )

మధ్యప్రాచ్య దేశాల్లో కొనసాగుతున్న భీకర యుద్ధ వాతావరణం విద్యార్థుల పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపింది.

యుద్ధం ఎఫెక్ట్: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రాచ్య దేశాల్లో కొనసాగుతున్న భీకర యుద్ధ వాతావరణం విద్యార్థుల పరీక్షలపై తీవ్ర ప్రభావం చూపింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతీకార దాడులతో ఆ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, అక్కడ జరగాల్సిన (ఇంటర్ సెకండ్ ఇయర్) 12వ తరగతి సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో మార్చి 16, 2026 నుంచి ఏప్రిల్ 10, 2026 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు రద్దు చేసినట్లు ఆదివారం సీబీఎస్ఈ ఒక ప్రకటన విడుదల చేసింది.

మార్చి 1, 3, 5, 7, 9 తేదీల్లో గతంలో వాయిదా వేసిన పరీక్షలను కూడా ఇప్పుడు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. యుద్ధ సంక్షోభం దృష్ట్యా విద్యార్థుల భద్రతను పరిగణనలోకి తీసుకుని, స్థానిక పాఠశాలలు, అధికారుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పరీక్షలు రద్దు కావడంతో విద్యార్థులకు మార్కులు ఎలా కేటాయించాలనే అంశంపై సీబీఎస్‌ఈ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఫలితాల ప్రకటనకు సంబంధించిన విధివిధానాలను (Mode of assessment) త్వరలోనే విడిగా ప్రకటిస్తామని బోర్డు తన సర్క్యులర్-6లో పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరగాల్సిన 10వ తరగతి పరీక్షల విషయంలో కూడా గతంలో వాయిదా పడిన వాటిని రద్దు చేస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. తాజా పరిణామాలతో గల్ఫ్ దేశాల్లోని వేలాది మంది భారతీయ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదుపరి ప్రకటన కోసం వేచి చూస్తున్నారు.

Next Story