హౌతీలపై మరోసారి యూఎస్, యూకే దాడులు: ఆ దేశాల మద్దతు

by Dishanational2 |
హౌతీలపై మరోసారి యూఎస్, యూకే దాడులు: ఆ దేశాల మద్దతు
X

దిశ, నేషనల్ బ్యూరో: యెమన్‌లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న సైనిక లక్ష్యాలపై అమెరికా, యూకేలు మరోసారి వైమాణిక దాడులు నిర్వహించాయి. ఇరు దేశాల యుద్ధ విమానాలు హౌతీ లక్ష్యాలపై ఎటాక్‌కు పాల్పడినట్టు తెలుస్తోంది. యెమన్‌లోని 18హౌతీ స్థావరాలపై దాడులు చేపట్టినట్టు అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ తెలిపింది. హౌతీలకు చెందిన క్షిపణి నిల్వలు, డ్రోన్‌లు, ఎయిర్ డిఫెన్స్, రాడార్లు, హెలికాప్టర్లకు సంబంధించిన హౌతీ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నట్టు వెల్లడించారు. హౌతీల సామర్థ్యాలను బలహీనపర్చడమే తమ లక్ష్యమని తెలిపారు. ఎర్ర సముద్రంలో హౌతీల దాడుల కారణంగా మధ్యప్రాచ్య దేశాల ఆర్థిక స్థితిగతులు, పర్యావరణం, ఇతర దేశాలకు మానవతా సహాయం అందజేయడంలో అతిపెద్ద సమస్యలు ఎదురవుతున్నాయని, కాబట్టి హౌతీలు దాడులు చేయడం మానుకోవాలని యూఎస్ హెచ్చరించింది.

ప్రాణాలు రక్షించడమే మా బాధ్యత: యూకే రక్షణ కార్యదర్శి గ్రాంట్ షాప్స్

దాడుల అనంతరం బ్రిటన్ రక్షణ కార్యదర్శి గ్రాంట్ షాప్స్ మాట్లాడుతూ..‘సముద్రంలో ప్రాణాలు కాపాడటం, నావిగేషన్ స్వేచ్ఛను సంరక్షించడం’ తమ బాధ్యత అని చెప్పారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి యెమెన్‌లోని హౌతీ సైనిక లక్ష్యాలకు వ్యతిరేకంగా దాడుల్లో పాల్గొన్నట్టు వెల్లడించారు. దాడులకు సిద్ధంగా ఉన్న ఏడు హౌతీ మొబైల్ యాంటీ షిప్ క్షిపణులను అంతకుముందు ధ్వంసం చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది. కాగా, ఇజ్రాయెల్-గాజా యుద్ధం నేపథ్యంలో ఎర్ర సముద్రంలో ఉన్న నౌకలపై హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.కాగా, యూఎస్, బ్రిటన్‌లు యెమన్‌పై దాడి చేయడం ఇది నాలుగోసారి. ఈ దాడులకు ఆస్ట్రేలియా, బహ్రెయిన్, కెనడా, డెన్మార్క్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ మద్దతు ఇచ్చాయి.



Next Story

Most Viewed