- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిహార్ విపక్షంలోకి మరో రెండు పార్టీలు.. 8కి చేరిన మహాఘట్బంధన్ పార్టీల సంఖ్య
బిహార్ విపక్ష కూటమిలోకి మరో రెండు పార్టీలు చేరాయి. దీంతో మహాఘట్బంధన్ పార్టీల సంఖ్య 8కి చేరింది.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీట్ల పంపకం మరింత జటిలంగా మారుతోంది. ఇప్పటికే ఎన్డీయే. మహాఘట్బంధన్ కూటములు ఈ అంశంపై చర్చలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చల్లో ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. అధికార ఎన్డీయే కూటమిలో చిరాగ్ పాశ్వాన్, జీతన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుశావహ తదితరుల డిమాండ్లతో సీట్ల పంపకం సమస్యాత్మకంగా మారుతోందట. ఇప్పటికే పలుమార్లు సీఎం నితీశ్ కుమార్ను, ఆయన విధానాలను బహిరంగంగానే చిరాగ్ పాశ్వాన్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదని కూడా పాశ్వాన్ ఆరోపించడం బిహార్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది.
కొత్తగా రెండు పార్టీలు..
ఎన్డీయేలో సమస్యల నేపథ్యంలో మహాఘట్బంధన్లో అంతా సజావుగా సాగిపోతుందనుకుంటే పొరబాటే. ఎందుకంటే ఈ కూటమిలో కూడా సీట్ల లెక్కలు తలనొప్పులు సృష్టిస్తున్నాయి. దీనికితోడు తాజాగా హేమంత్ సోరెన్కు చెందిన జార్ఖండ్ ముక్తి మోర్చా, పశుపతి పరస్కు చెందిన ఎల్జేపీ కూడా విపక్ష కూటమిలో చేరాయి. దీంతో ఈ కూటమిలోని పార్టీల సంఖ్య 8కి చేరింది. ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ-ఎంఎల్ పార్టీలు గత ఎన్నికల్లో తమకు కేటాయించిన వాటికంటే ఎక్కువ సీట్లు ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్న నేపథ్యంలో.. కొత్త పార్టీలు కూటమిలో చేరడం ఈ లెక్కలను మరింత జటిలం చేసింది.






