- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరాన్ తోకముడిచింది! గల్ఫ్ దేశాలకు క్షమాపణలపై ట్రంప్ సెటైర్లు
మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రాభవం కోల్పోయిందని, అది ఇక ఎంతమాత్రం పొరుగు దేశాలను బెదిరించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావం కోల్పోయిందని, అది ఇక ఎంతమాత్రం పొరుగు దేశాలను బెదిరించలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పడంపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన నిరంతర దాడుల ధాటికి ఇరాన్ తోకముడిచిందని ఆయన సెటైర్లు వేశారు.
అమెరికా ఒత్తిడికే ఇరాన్ లొంగిపోయింది: ట్రంప్
శనివారం తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో ఈ అంశంపై ట్రంప్ స్పందిస్తూ.. ఇరాన్ పరిస్థితిని తీవ్రంగా విమర్శించారు. ‘నరకం చూస్తున్న ఇరాన్, చివరకు తన పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పి లొంగిపోయింది. ఇకపై వారిపై దాడులు చేయబోమని మాట ఇచ్చింది. ఒకప్పుడు మధ్యప్రాచ్యాన్ని శాసించాలని చూసిన ఇరాన్, ఇప్పుడు బెదిరించే స్థాయి నుండి 'లూజర్' స్థాయికి పడిపోయింది’ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ సైనిక చర్యల వల్లే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకుందని ఆయన విశ్లేషించారు.
క్షమాపణ కోరిన ఇరాన్ అధ్యక్షుడు
మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఒక అనూహ్య ప్రకటన చేస్తూ పొరుగు దేశాలకు క్షమాపణలు తెలిపారు. ఇరాన్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడుల వల్ల ప్రభావితమైన గల్ఫ్ దేశాల ప్రజలకు, ప్రభుత్వాలకు ఆయన క్షమాపణలు చెప్పారు. తమ దేశంపై దాడులకు పొరుగు దేశాల గడ్డను వేదికగా చేసుకోనంత కాలం, తాము వారిపై దాడులు చేయబోమని పెజెష్కియాన్ స్పష్టం చేశారు. కాగా, గత వారం రోజులుగా మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు ఉన్న సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, కువైట్, బహ్రెయిన్ వంటి దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో మౌలిక సదుపాయాలు, విమానాశ్రయాలు, ఇంధన కేంద్రాలు దెబ్బతినడమే కాకుండా పౌర మరణాలు కూడా సంభవించాయి. దీనిపై గల్ఫ్ దేశాలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో, దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఇరాన్ ఈ క్షమాపణల బాట పట్టినట్లు తెలుస్తోంది.






