- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇదో రాజకీయ కుట్ర.. మాజీ ప్రధాని కేపీ శర్మ అరెస్ట్పై స్పందించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్
నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం ఆ దేశ మాజీ ప్రధాని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ చైర్మన్ కేపీ శర్మ ఓలీని నేపాల్ పోలీసులు భక్తపూర్లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నేపాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం ఆ దేశ మాజీ ప్రధాని, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) చైర్మన్ కేపీ శర్మ ఓలీని నేపాల్ పోలీసులు భక్తపూర్లోని ఆయన నివాసంలో అరెస్టు చేశారు. 2025 సెప్టెంబరులో జరిగిన ‘జెన్ జెడ్’ (Gen Z) అవినీతి వ్యతిరేక ఆందోళన ఘటనలో ప్రాణనష్టానికి కారకులయ్యారన్న ఆరోపణలపై ఈ అరెస్టు జరిగింది. అయితే ఈ అరెస్టును ఓలీ సొంత పార్టీ తీవ్రంగా ఖండించింది.
ఆధారాలు లేవు.. ఇదో రాజకీయ కుట్ర..
ఓలీ అరెస్టుపై కమ్యూనిస్టు పార్టీ (సీపీఎన్-యూఎంఎల్) భగ్గుమంది. దర్యాప్తు కమిటీ నివేదికను ఉద్దేశపూర్వకంగానే తప్పుగా రూపొందించారని, అరెస్టు చేయడానికి అందులో తగిన ఆధారాలు లేవని పార్టీ నాయకుడు పంత్ ఆరోపించారు. మాజీ విదేశాంగ మంత్రి, పార్టీ సీనియర్ నేత ప్రదీప్ గ్యావాలి మాట్లాడుతూ.. ‘ఇది ముమ్మాటికీ మా పార్టీ చైర్మన్పై తీసుకున్న రాజకీయ ప్రతీకార చర్య’ అని ఆరోపించారు. తాజా పరిణామాల నేపథ్యంలో తదుపరి కార్యాచరణను చర్చించేందుకు సీపీఎన్-యూఎంఎల్ పార్టీ అత్యవసర సెక్రటేరియట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ కూడా అరెస్ట్
ఓలీతో పాటు నేపాలీ కాంగ్రెస్ నేత, మాజీ హోంమంత్రి రమేష్ లేఖక్ను కూడా పోలీసులు ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. హోం మంత్రిత్వ శాఖ చేసిన అధికారిక ఫిర్యాదు, దర్యాప్తు అనంతరం జారీ అయిన వారెంట్ల మేరకే ఈ అరెస్టులు జరిగాయి. మాజీ న్యాయమూర్తి గౌరీ బహదూర్ కర్కీ నేతృత్వంలోని కమిషన్ చేసిన సిఫార్సులను అమలు చేయడంలో భాగంగానే పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు ‘ఖాట్మండు పోస్ట్’ పేర్కొంది.
నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష!
ప్రధాని బలేంద్ర షా నేతృత్వంలోని మంత్రివర్గం శుక్రవారం జరిగిన సమావేశంలో.. కర్కీ కమిషన్ నివేదిక అమలుకు పచ్చజెండా ఊపింది. కేపీ శర్మ ఓలీ, రమేష్ లేఖక్, అప్పటి పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ చంద్ర కుబేర్ ఖాపుంగ్లపై నేషనల్ పీనల్ కోడ్లోని సెక్షన్ 181, 182 కింద ‘క్రిమినల్ నిర్లక్ష్యం’ కేసులు నమోదయ్యాయి. ఇందులో దోషులుగా తేలితే పదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కాగా, 2025 సెప్టెంబరులో నేపాల్లో అవినీతికి వ్యతిరేకంగా ‘జెన్ జెడ్’ యువత భారీ ఆందోళనలు చేపట్టింది. ఈ నిరసనలను అణచివేసే క్రమంలో చోటుచేసుకున్న ఘర్షణల్లో 77 మంది ప్రాణాలు కోల్పోగా, కోట్లాది రూపాయల మేర ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసమయ్యాయి.






