తీవ్రపరిణామాలుంటాయ్: ఇరాన్‌కు పాక్ హెచ్చరిక

by Dishanational2 |
తీవ్రపరిణామాలుంటాయ్: ఇరాన్‌కు పాక్ హెచ్చరిక
X

దిశ, నేషనల్ బ్యూరో: బలూచీ ప్రావీన్సుల్లోని జైష్ అల్ అద్ల్ తీవ్ర వాద సంస్థ స్థావరాలపై ఇరాన్ చేసిన క్షిపణి దాడిని పాక్ తీవ్రంగా ఖండించింది. ఇది చట్టవిరుద్దమైన వైమానిక దాడి అని అభివర్ణించింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారని తెలిపింది. దీనికి తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు పాకిస్తాన్ లోని ఇరాన్ రాయబారి ఎదుట తీవ్ర నిరసనను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ దాడి పాక్ సార్వబౌమాధికారాన్ని ఉల్లంఘించడమేనని తేల్చిచెప్పింది. ఇది ఆయోధయోగ్యం కాదని పేర్కొంది. ఇరు దేశాల మధ్య చర్చలకు అవకాశం ఉన్నప్పటికీ ఈ తరహా చర్యలకు పాల్పడటం ఆందోళనకరమని వెల్లడించింది. ‘ఏకపక్ష చర్యలు ద్వైపాక్షిక సంబంధాలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి’ అని తెలిపింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకారం, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని జైష్ ఉల్-అద్ల్ తీవ్రవాద సంస్థ రెండు స్థావరాలను డ్రోన్లు క్షిపణులతో ధ్వంసం చేసినట్టు ఇరాన్ మీడియా తెలిపింది. ఈ క్రమంలోనే పాక్ తీవ్రంగా ఖండించింది. కాగా, జైష్ అల్ అద్ల్ సంస్థను ఆర్మీ ఆఫ్ జస్టిస్ అని కూడా పిలుస్తారు, ఇది 2012లో స్థాపించబడిన సున్నీ మిలిటెంట్ గ్రూప్. ఇది పాకిస్తాన్ సరిహద్దులో పనిచేస్తోంది. బాంబు దాడులు, ఇరాన్ సరిహద్దు పోలీసుల అపహరణకు బాధ్యత వహిస్తున్నట్టు ఆరోపణలున్నాయి.

Next Story

Most Viewed