‘ఆపరేషన్ సిందూర్’లో రఫెల్ యుద్ధవిమానాలు కూలిపోయినట్లు సమాచారం ఏమీ లేదు

by Shamantha N |   (  Updated:2025-06-15 05:36:12  IST  )

‘ఆపరేషన్ సిందూర్’లో భారత వాయుసేనకు చెందిన రఫెల్ యుద్ధ విమానాలను పాకిస్తాన్‌ కూల్చివేసిందన్న వాదనను డసాల్ట్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ తిప్పికొట్టారు.

‘ఆపరేషన్ సిందూర్’లో రఫెల్ యుద్ధవిమానాలు కూలిపోయినట్లు సమాచారం ఏమీ లేదు
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్’లో భారత వాయుసేనకు చెందిన రఫెల్ యుద్ధ విమానాలను పాకిస్తాన్‌ కూల్చివేసిందన్న వాదనను డసాల్ట్ ఏవియేషన్ సీఈఓ ఎరిక్ ట్రాపియర్ తిప్పికొట్టారు. ఫ్రెంచ్ మ్యాగజైన్ ‘చాలెంజెస్‌’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రాపియర్ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో రఫెల్ విమానాలను కోల్పోయినట్టు భారత వైమానిక దళం నుంచి తమకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని తెలిపారు. పాకిస్తాన్ చెప్పినట్టు మూడు రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చేశారన్న వాదన అసత్యమని స్పష్టం చేశారు.

రపెల్ తో బహుముఖంగా దాడి చేయొచ్చు

ఆధునిక కాలంలో యుద్ధాల్లో విజయం విమానాలు లేదా సైనికులను కోల్పోయామా అనే దానిపై కాకుండా అసలు లక్ష్యాలు సాధించామా అన్నదానిపై ఆధారపడి ఉండాలన్నారు. 2020లో భారత వైమానిక దళంలో రఫెల్‌ యుద్ధవిమానాల ప్రవేశం తర్వాత భారత్ చేపట్టిన తొలి పెద్ద మిషన్‌ ‘ఆపరేషన్ సిందూర్’. ఇది భారత వైమానిక దళం శక్తిని ప్రపంచానికి తెలిపినట్లు భావిస్తున్నారు. ఈ దాడిలో కచ్చితమైన లక్ష్యాలను ఛేదించడంతో పాటు, గగనతల ఆధిపత్యాన్ని నిరూపించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడి తర్వాత పాకిస్తాన్ పాక్షికంగా వెనక్కి తగ్గి, కాల్పుల విరమణకు సిద్ధమైంది. రఫెల్‌ యుద్ధవిమానాలు అత్యంత సామర్థ్యం కలిగినవి. అమెరికా తయారు చేసిన ఎఫ్-35లకన్నా, చైనా విమానాలకన్నా రఫెల్‌లు బహుముఖ వినియోగానికి అనుకూలమని ట్రాపియర్ తెలిపారు.దక్షిణాసియా ప్రాంతంలో ఆయుధాల కొనుగోలు, గగనతల ఆధిపత్యం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వస్తున్న నేపథ్యంలో ట్రాపియర్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ వాదనలను తిప్పికొట్టినట్లైంది.

Next Story