మారణహోమం.. భారీ విధ్వంసంలో పెరిగిన మృతుల సంఖ్య

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-14 07:05:16  IST  )

ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో ఇరాన్‌లో మొదలైన ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ హింసకు దారి తీశాయి.

మారణహోమం.. భారీ విధ్వంసంలో పెరిగిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం వంటి సమస్యలతో ఇరాన్‌లో మొదలైన ఆందోళనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా భారీ హింసకు దారి తీశాయి. గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఈ నిరసనలను అణిచివేసే క్రమంలో ఇరాన్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి.

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ (Human Rights Activists News Agency) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు ఈ ఆందోళనల్లో కనీసం 2,571 మంది మృతి చెందినట్లు అంచనా వేస్తున్నారు. వీరిలో 2,403 మంది ఆందోళనకారులు, 147 మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వానికి చెందినవారు ఉన్నట్లు పేర్కొంది.

ఆందోళనలతో సంబంధం లేని వారు కూడా ఈ హింసలో బలయ్యారు. ఇప్పటివరకు 12 మంది చిన్నారులు, 9 మంది సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆ సంస్థ వెల్లడించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలకు సంబంధించి 18,000 మందికి పైగా ఆందోళనకారులను భద్రతా బలగాలు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఇరాన్ ప్రభుత్వం నిరసనలను అణిచివేసేందుకు ప్రత్యక్ష కాల్పులు, టియర్ గ్యాస్, భారీగా అరెస్టులు చేపడుతున్నట్లు మానవ హక్కుల సంస్థలు ఆరోపిస్తున్నాయి. పరిస్థితిని బయట ప్రపంచానికి తెలియకుండా అడ్డుకునేందుకు పలుమార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం కూడా జరిగిందని చెబుతున్నారు.

ఈ ఘటనలపై అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి సంస్థలు ఇరాన్ ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ, పౌరులపై హింసను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తున్నాయి. అమెరికా సహా పలు దేశాలు కూడా ఇరాన్ పరిణామాలపై నిశితంగా గమనిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మానవ హక్కుల సంస్థలు హెచ్చరిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతుండటంతో.. ఇరాన్ భవిష్యత్ రాజకీయ, సామాజిక పరిస్థితులపై అనిశ్చితి నెలకొంది.

READ MORE ....

రైలుపై కుప్పకూలిన భారీ క్రేన్.. ఏకంగా 22 మంది దుర్మరణం

Next Story