ఇటు ఇండియా.. అటు ఉక్రెయిన్‌లోనూ రష్యా ఎన్నికలు.. ఎందుకు ?

by Dishanational4 |
ఇటు ఇండియా.. అటు ఉక్రెయిన్‌లోనూ రష్యా ఎన్నికలు.. ఎందుకు ?
X

దిశ, నేషనల్ బ్యూరో : రష్యాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. ఇంతక్రితం ఈ పోలింగ్ ప్రక్రియ ఒకరోజులోనే ముగిసేది. ఈదఫా తొలిసారిగా మూడు రోజుల పాటు (మార్చి 17 వరకు) ఓటింగ్‌ను కంటిన్యూ చేయనున్నారు. ఉక్రెయిన్‌ దేశంలో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతాల్లోనూ ఆర్మీ పహారా నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈసారి ఆ ప్రాంతాల ప్రజలు కూడా రష్యా అధ్యక్షుడి ఓటింగ్‌లో పాల్గొంటుండటం గమనార్హం. ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకున్న సమస్యాత్మక ప్రాంతాలలోనూ పోలింగ్ నిర్వహిస్తున్నందు వల్లే ఈదఫా ఎన్నికల ప్రక్రియను మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. మార్చి 17న తుది విడత పోలింగ్ జరుగుతుంది. అదే రోజు రాత్రికల్లా రష్యా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను విడుదల చేస్తారు.

పుతిన్ ఐదోసారీ అధ్యక్షుడు అవుతారా ?

ఈసారి అధ్యక్ష ఎన్నికల బరిలో రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌తో పాటు ఎల్‌డీపీఆర్‌ నేత లియోనిడ్‌ స్లట్‌స్కీ, న్యూ పీపుల్‌ పార్టీ నేత వ్లాదిస్లేవ్‌ దవాన్‌కోవ్, కమ్యూనిస్ట్‌ పార్టీ నేత నికోలే ఖరిటోనోవ్‌లు బరిలో ఉన్నారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్‌ ఇప్పటికే నాలుగు సార్లు(2000, 2004, 2012, 2018) అధ్యక్ష పీఠాన్ని అధిరోహించారు. 2008లో దేశ ప్రధానిగానూ ఆయన సేవలు అందించారు. అధ్యక్ష రేసులో పుతిన్‌ ఐదోసారి కూడా విజయబావుటా ఎగరేస్తారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దేశ ఓటర్లలో 75 శాతం మంది మద్దతు పుతిన్‌కు ఉందని, మిగతా ముగ్గురు అభ్యర్థులు చెరో 5 శాతం ఓట్లతో సరిపెట్టుకుంటారని ముందస్తు పోలింగ్‌ అంచనాలు విశ్లేషిస్తున్నాయి.ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే మరో ఆరేళ్ల పాటు రష్యా అ‍ధ్యక్ష పదవిలో పుతిన్ కొనసాగుతారు.

కేరళలో రష్యా ఎన్నికల పోలింగ్.. ఎందుకు ?

రష్యా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ మనదేశంలోని కేరళ రాష్ట్రంలోనూ జరుగుతోంది. కేరళలో స్థిరపడిన రష్యన్లు, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రష్యా పర్యాటకులు ఓటుహక్కును వినియోగించుకునేందుకు తిరువనంతపురంలోని రష్యన్ ఫెడరేషన్ కాన్సులేట్ కార్యాలయం ‘రష్యన్ హౌస్‌’లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు.ఈ బూత్‌లో దాదాపు 60 మంది రష్యన్లు రష్యా అధ్యక్ష ఎన్నికల కోసం ముందస్తుగా ఓటు వేశారు . రష్యన్ ఓటర్లలో ఎక్కువ మంది ఎర్నాకుళం, వర్కల, కోవలం నుంచి ఓటు వేయడానికి తిరువనంతపురానికి వచ్చారు. వీరు వేసిన ఓట్లతో కూడిన బ్యాలెట్ బాక్సులను తిరువనంతపురం నుంచి చెన్నైకు.. చెన్నై నుంచి మాస్కోకు పంపిస్తారు. మార్చి 17న జరిగే ఓట్ల లెక్కింపులో కేరళలో రష్యన్లు వేసిన ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.ఓటింగ్ ప్రక్రియను సాంప్రదాయ పేపర్ బ్యాలెట్‌లను ఉపయోగించి నిర్వహించారు. రష్యా అధ్యక్ష ఎన్నికలకు కేరళలో పోలింగ్ నిర్వహించడం ఇది మూడోసారి అని తిరువనంతపురంలోని రష్యన్ హౌస్ డైరెక్టర్ రతీష్ నాయర్ మీడియాకు వెల్లడించారు. కేరళలోని రష్యన్ పౌరులకు పోలింగ్ ప్రక్రియలో సహకరించినందుకు రష్యా కాన్సులేట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియను రష్యన్ కాన్సులేట్ జనరల్, చెన్నైలోని సీనియర్ కాన్సుల్ సెర్గీ అజారోవ్ పర్యవేక్షించారు.



Next Story

Most Viewed