భారత్ - నేపాల్ సంబంధాల బలోపేతానికి "హిట్" ఫార్ములా: మోడీ

by Disha Web Desk 17 |
భారత్ - నేపాల్ సంబంధాల బలోపేతానికి హిట్ ఫార్ములా: మోడీ
X

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’ ఇంధనం, కనెక్టివిటీ, వాణిజ్యం సహా అనేక రంగాలలో ఇరుదేశాల సహకారాన్ని పెంపొందించుకునే విషయంలో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా నేపాల్ రైల్వేలోని కుర్తా-బిజల్‌పురా సెక్షన్ స్మారక ఫలకాన్ని గురువారం సంయుక్తంగా ఆవిష్కరించారు.

ప్రధాని మోడీ మాట్లాడుతూ.. "నాకు గుర్తుంది.. 9 సంవత్సరాల క్రితం(2014లో) నేను తొలిసారి నేపాల్‌ను సందర్శించాను. ఆ సమయంలో నేను భారతదేశం-నేపాల్ సంబంధాల కోసం "హిట్" సూత్రాన్ని ప్రతిపాదించాను. హైవేలు, ఐ వేలు, ట్రాన్స్ వేస్ (హిట్) డెవలప్మెంట్ గురించి అప్పుడు చెప్పాను. ఈ రోజు నేపాల్ ప్రధాని, నేను భవిష్యత్తులో మా భాగస్వామ్యాన్ని సూపర్ హిట్‌గా మార్చడానికి చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నాము” అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో భాగంగా బీహార్‌లోని బత్నాహా నుంచి నేపాల్ కస్టమ్ యార్డ్ వరకు భారతీయ కార్గో రైలు సర్వీసును జెండా ఊపి మోడీ, దహల్ ప్రారంభించారు. రుపైదిహా (ఇండియా) - నేపాల్‌గంజ్‌ (నేపాల్‌), సనౌలీ(ఇండియా) - భైరహవా(నేపాల్‌)లలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులను ఇరువురు ప్రధానులు ప్రారంభించారు. గోరఖ్‌పూర్ (ఉత్తరప్రదేశ్) -న్యూ బుట్వాల్ (నేపాల్) సబ్‌స్టేషన్ 400 కేవీ క్రాస్ బోర్డర్ విద్యుత్ పంపిణీ లైన్‌ను ఆవిష్కరించారు.

భారత్, నేపాల్ మధ్య మోతిహారి-అమ్లేఖ్‌గంజ్ ఆయిల్ పైప్‌లైన్ రెండో దశ పనులకు ఇద్దరు నాయకులు శంకుస్థాపన చేశారు. రెండుదేశాల ప్రతినిధుల స్థాయి చర్చల అనంతరం ఇరువురు నేతలు ఈ ప్రాజెక్టులను ప్రారంభించారు.

Also Read..

'ఇలా జరుగుతుందని ఊహించలేదు': రాహుల్ గాంధీ



Next Story

Most Viewed