పాక్ ఎన్నికల్లో రిగ్గింగ్: విచారణకు ఆదేశించిన ఈసీ

by Dishanational2 |
పాక్ ఎన్నికల్లో రిగ్గింగ్: విచారణకు ఆదేశించిన ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల జరిగిన పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఓడించడానికి అనేక అవకతవకలకు పాల్పడ్డారని రావల్పిండి పోలింగ్ అధికారి లియాఖత్ అలీ చట్టా ఆరోపించిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన పాక్ ఎన్నికల సంఘం వీటిపై దర్యాప్తు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. కమిటీ నివేదిక ఆధారంగా దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. మూడు రోజుల్లో కమిటీ తన నివేదికను అందజేయనుంది. కాగా, లియాఖత్ అలీ మాట్లాడుతూ.. ఓడిపోయే అభ్యర్థులను బలవంతంగా గెలిపించామని తెలిపారు. సుమారు 13 మంది అభ్యర్థులను విజేతలుగా ప్రకటించామని చెప్పారు. ఓడిపోయే అభ్యర్థులను 50 వేల ఓట్ల తేడాతో గెలిపించామని, పీటీఐకి మద్దతు ఇస్తున్న స్వతంత్రులను ఓడించేందుకు ఇదంతా చేశారని ఆరోపించారు. ‘ఈ తప్పులన్నింటికీ నేను బాధ్యత వహిస్తున్నా. ప్రధాన ఎన్నికల కమిషనర్, ప్రధాన న్యాయమూర్తికి కూడా ఇందులో ప్రమేయం ఉంది’ అని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన ఈసీ విచారణకు ఆదేశించింది. కాగా, ఎన్నికల్లో అవకతవకు జరిగాయని ఆరోపిస్తూ.. పీటీఐ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు ప్రారంభించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. అయితే కొత్తగా నియమితులైన రావల్పిండి కమిషనర్ సైఫ్ అన్వర్ జప్పా ఈ ఆరోపణలను ఖండించారు. ఈనెల 8న జరిగిన పాక్ ఎన్నికల్లో పాకిస్థాన్ తెహ్రిక్ ఇన్సాఫ్ పార్టీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థులు 93 స్థానాలు గెలుచుకోగా, పాకిస్తాన్ ముస్లిం లీగ్ (పీఎమ్‌ఎల్ఎన్) 75, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) 54, ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ పాకిస్తాన్ 17 సీట్లలో విజయం సాధించాయి. పీఎమ్‌ఎల్ఎన్, పీపీపీ, ఎంక్యూఎంపీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.


Next Story

Most Viewed