ఆధిక్యంలో నవాజ్.. పాక్‌లో ముగిసిన పోలింగ్.. ఓట్ల లెక్కింపు షురూ

by Dishanational4 |
ఆధిక్యంలో నవాజ్.. పాక్‌లో ముగిసిన పోలింగ్.. ఓట్ల లెక్కింపు షురూ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఆర్థిక సంక్షోభం, ఉగ్రదాడుల బీభత్సం నేపథ్యంలో పాకిస్తాన్‌లో గురువారం సాయంత్రం 5 గంటలకు జాతీయ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసారి అత్యల్పంగా 45 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఉగ్రవాదులు మరిన్ని దాడులకు పాల్పడే ముప్పు ఉందన్న ఆందోళనలతో ప్రజలు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. పోలింగ్ వేళ.. భద్రతా కారణాలను చూపుతూ పాక్‌లోని చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీంతో ఎంతోమంది ప్రజలు పోలింగ్ కేంద్రాల వివరాలను ఇంటర్నెట్‌లో ట్రాక్ చేయలేక.. ఓటు వేసేందుకు వెళ్లలేదు. 6.50 లక్షల మందికిపైగా సైన్యం, పారామిలటరీ, పోలీసు బలగాలను ఎన్నికల భద్రత కోసం మోహరించినా పాక్ ప్రజలు ధైర్యంగా ఓటువేసేందుకు ముందుకు రాకపోవడం గమనార్హం. పోలింగ్‌కు సరిగ్గా ఒకరోజు ముందు(బుధవారం) నైరుతి బెలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని ఇద్దరు అభ్యర్థుల కార్యాలయాల వద్ద జరిగిన రెండు బాంబుపేలుళ్లలో దాదాపు 28 మంది చనిపోయారు. ఈ ఘటనతో దేశ భద్రతా వ్యవస్థపై ఓటర్లు నమ్మకం కోల్పోయారని భావిస్తున్నారు. పలు పోలింగ్ కేంద్రాల్లో పెద్దఎత్తున రిగ్గింగ్ జరిగిందనే వార్తలు కూడా వచ్చాయి.

శుక్రవారం ఉదయంకల్లా క్లారిటీ

పోలింగ్ ముగిసిన వెంటనే భారీ భద్రత నడుమ ఓట్ల లెక్కింపును మొదలుపెట్టారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. గురువారం రాత్రి 9 గంటల సమయానికి మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పార్టీ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) ఆధిక్యంలో దూసుకుపోతోంది. పాక్ ఎన్నికల మొదటి రిజల్ట్ గురువారం అర్ధరాత్రి కంటే ముందే రిలీజయ్యే అవకాశం ఉందని అంటున్నారు. శుక్రవారం ఉదయంకల్లా ఏ పార్టీ ఆధిక్యంలో ఉందనే దానిపై స్పష్టత వస్తుందని చెబుతున్నారు. లాహోర్‌లోని ఒక పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి, పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్) పార్టీ చీఫ్ నవాజ్ షరీఫ్ ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు తాను పాక్ సైన్యంతో ఎలాంటి డీల్ కుదుర్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు. దేశపు మిలిటరీతో తనకు ఎటువంటి సమస్యలు లేవన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు నవాజ్ షరీఫ్ పార్టీకే ఎక్కువగా ఉన్నాయనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే దేశానికి నాలుగోసారి ప్రధానమంత్రిగా నవాజ్ బాధ్యతలు చేపడతారు.

Next Story