శాంతా? యుద్ధమా?.. తేలేది రేపే!

by Harish SP |   (  Updated:2026-04-21 10:57:12  IST  )

ఇస్లామాబాద్‌ 2.0 చర్చలు బుధవారం ఉదయం 10గంటలకు అమెరికా-ఇరాన్ మధ్య ప్రారంభం కానున్నాయి. ఫలితంపై అందరిలో ఆసక్తి నెలకొన్నది

శాంతా? యుద్ధమా?.. తేలేది రేపే!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచం అంతా ఎదురుచూస్తున్న ఇరాన్, అమెరికా శాంతి చర్చలు రేపు (బుధవారం) ఇస్లామాబాద్ లో ప్రారంభం కానున్నాయి. చివరినిమిషం వరకు రెండు దేశాలు ఊగిసలాడినా.. చివరికి చర్చలకే మొగ్గు చూపాయి. ఈ క్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ బృందం వాషింగ్టన్ నుంచి ఎయిర్‌ఫోర్స్ 2 విమానంలో సోమవారం ఇస్లామాబాద్ కు బయలుదేరింది. ముందుగా ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌తో జేడీ వ్యాన్స్ భేటీ అవుతారు. ఈ సందర్భంగా అమెరికా నిఘా అధికారులు ప్రాంతీయ ఉద్రిక్తతలపై చర్చతోపాటు పాక్ అందించిన నిఘా సమాచారంపై తమ అనుమానాలు నివృత్తి చేసుకోనున్నారు. బుధవారం ఉదయం 10గంటలకు ఇరాన్ ప్రతినిధులతో సెరెనా హోటల్ లేదా జిన్నా కన్వెన్షన్ సెంటర్ లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య చర్చలు ప్రారంభించనున్నారు.

ఒమన్‌కు యురేనియం!

ఇరాన్ తదుపరి సుప్రీం లీడర్ మొజ్తబా నుంచి యుద్ధ విరమణకు సానుకూల స్పందన రావడంతో శుద్ధి చేసిన యురేనియంను తటస్థ దేశమైన ఒమన్ అప్పగించేందుకు ఇరాన్ ప్రతినిధులు అంగీకరించనున్నారు. ఇరాన్ బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ నాయకత్వం వహించనున్నారు. ఆయనతో పాటు అణుశక్తి విభాగం అధిపతి మహమ్మద్ ఎస్లామీ కూడా ఉండే అవకాశం ఉంది.

యెమెన్ విభజనను నో

యూఏఈ మొదటినుంచి డిమాండ్ చేస్తున్నట్టుగా యెమెన్‌ను దేశ రాజధాని కేంద్రంగా, అడెబ్ కేంద్రంగా (సముద్రతీర ప్రాంతం) ఉన్న ప్రాంతాలను రెండు దేశాలుగా విభజించాలన్న షరతును ఇరాన్ వ్యతిరేకిస్తున్నది. ఈ విషయంలో అమెరికా కూడా మౌనంగా ఉన్నది. దీంతో యెమెన్ రెండ దేశాలు అయ్యే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పవచ్చు.

చర్చలపై పాక్ మౌనం

చర్చలపై పాక్ మీడియా మౌనం పాటించడానికి కారణం.. అక్కడి ప్రభుత్వం మీడియా బ్లాక్ అవుట్ ప్రకటించింది. దీంతోపాటు చర్చలు జరుగుతాయని భావిస్తున్న జిన్నా కన్వెన్షన్ సెంటర్‌లోకి కొద్దిమంది సెలెక్టెడ్ మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇస్లామాబాద్, రావల్పిండి ప్రధాన రహదారులను పూర్తిగా మూసివేయడంతో రెండు నగరాల మధ్య రాకపోకలకు పూర్తిగా అంతరాయం ఏర్పడింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పూర్తిగా రక్షణ వలయంలో ఉన్నది.

Next Story