భారత్‌తో వివాదం వేళ బలపడుతున్న చైనా, మాల్దీవుల బంధం

by Dishanational1 |
భారత్‌తో వివాదం వేళ బలపడుతున్న చైనా, మాల్దీవుల బంధం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌తో వివాదం కొనసాగుతున్న వేళ మాల్దీవుల కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ మయిజు, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య స్నేహం బలపడుతోంది. మొహమ్మద్ మయిజు మొదటిసారి బీజింగ్ పర్యటన సందర్భంగా చైనాతో సంబంధాలను అప్‌గ్రేడ్ చేసుకుంటున్నారు. ఐదు రోజుల పర్యటన నిమిత్తం చైనాకు వెళ్లిన మయిజు ఆ దేశాధినేత జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మాట్లాడుతూ మయిజును 'పాత స్నేహితుడు' అంటూ సంభోదించారు. 'చైనా, మాల్దీవుల సంబంధాలు గతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు, భవిష్యత్తులో మరింత ముందుకు సాగేందుకు చారిత్రాత్మక అవకాశాన్ని కల్పిస్తున్నాయని' జిన్‌పింగ్ మయిజుతో అన్నట్టు చైనా ప్రభుత్వ మీడియా పేర్కొంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ, లక్షద్వీప్‌పై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు చేసిన వ్యాఖ్యల కారణంగా ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా, మాల్దీవుల అధ్యక్షుల భేటీ చర్చనీయాంసం అయింది. మయిజు చైనాకు అనుకూలంగా ఉంటారనే ఊహాగానాలున్నాయి. అందుకు తగినట్టుగానే చైనాను మిత్రదేశంగానే కాకుండా అభివృద్ధి భాగస్వామిగా పేర్కొంటూ వస్తున్నారు. ఇటీవలే మాల్దీవులకు పర్యాటకులను పంపించాలని చైనాను కోరారు.

Next Story