తుపాను బీభత్సం.. 85 మంది మృతి

by Naga Rani Yarlagadda |

ఈ ఏడాది సంభవించిన అత్యంత బలమైన తుపానులలో కల్మేగి ఒకటి. ఫిలిప్పీన్స్ ను ఈ సైక్లోన్ అతలాకుతలం చేసింది.

తుపాను బీభత్సం.. 85 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ ఏడాది సంభవించిన అత్యంత బలమైన తుపానులలో కల్మేగి (Kalmaegi Typhoon) ఒకటి. ఫిలిప్పీన్స్ ను ఈ సైక్లోన్ అతలాకుతలం చేసింది. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించగా.. ఇప్పటి వరకూ 85 మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరో 75 మంది గల్లంతయ్యారని, 17 మంది గాయపడ్డారని తెలిపారు. వరదల కారణంగా అనేక ఇళ్లు ధ్వంసమవ్వగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. అత్యంత అధిక జనాభా కలిగిన సెబు పట్టణాన్ని వరదలు ముంచెత్తాయి. కొందరు ప్రజలు ఇళ్లు మునిగిపోవడంతో పైకప్పులపైకి చేరి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విపత్తు కారణంగా 4 లక్షల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు.

కార్లు, షిప్పింగ్ కంటైనర్లు వరదల్లో కొట్టుకుపోతున్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. సెబుకు దక్షిణంగా ఉన్న మిండానావో ద్వీపంలో సహాయక చర్యలకు వెళ్లిన సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ఆరుగురు సిబ్బంది మరణించారు. స్థానికంగా టినో హరికెన్ గా పిలుస్తోన్న ఈ తుపాను మంగళవారం తెల్లవారుజామునే తీరాన్ని తాకినా.. గంటకు 130 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇది ప్రస్తుతం విన్యాస్ దీవుల మీదుగా దక్షిణ చైనా వైపు కదులుతున్నట్లు అక్కడి వాతావరణ నిపుణులు అంచనా వేశారు. కొన్ని ప్రాంతాల్లో వరదలు తగ్గినా.. ఇళ్లలో పేరుకుపోయిన బురద, కొట్టుకుపోయిన వాహనాలను చూసి ప్రజలు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Next Story