మెడికల్ కాలేజీ అనుమతుల్లో రూ. కోట్ల కుంభకోణం.. ముమ్మరంగా సీబీఐ దర్యాప్తు

by Shamantha N |   (  Updated:2025-07-05 08:55:13  IST  )

భారత వైద్య విద్యా వ్యవస్థలోనే అతి పెద్ద కుంభకోణం మెడికల్ కాలేజ్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణలో ఈ స్కాంలో సీనియర్ అధికారులు, మధ్యవర్తులు, అగ్రశ్రేణి విద్యావేత్తలు, గోడ్మాన్ రావతపురా సర్కార్ ఉన్నట్లు వెల్లడైంది.

మెడికల్ కాలేజీ అనుమతుల్లో రూ. కోట్ల కుంభకోణం.. ముమ్మరంగా సీబీఐ దర్యాప్తు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత వైద్య విద్యా వ్యవస్థలోనే అతి పెద్ద కుంభకోణం మెడికల్ కాలేజ్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) విచారణలో ఈ స్కాంలో సీనియర్ అధికారులు, మధ్యవర్తులు, అగ్రశ్రేణి విద్యావేత్తలు, గోడ్మాన్ రావతపురా సర్కార్ ఉన్నట్లు వెల్లడైంది. యూజీసీ మాజీ ఛైర్మన్ డీపీ సింగ్, ఇండోర్‌కి చెందిన ఇండెక్స్ మెడికల్ కాలేజ్ అధినేత సురేష్ సింగ్ భడోరియా, మాజీ (IFS) అధికారి సంజయ్ శుక్లా వంటి పేరొందినవారు నిందితులుగా ఉన్నారు. వీరంతా మెడికల్ కాలేజీలు అక్రమంగా అనుమతులు పొందేందుకు కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ అధ్యాపకులు, డమ్మీ తనిఖీలు, ఫైళ్లు, హవాలా మార్గాల ద్వారా డబ్బు పంపిణీ, ఇవన్నీ ఈ మల్టీ-కోర్ స్కామ్‌లో భాగంగా బయటపడ్డాయి.

రావతపురా మెడికల్ ఇన్ స్టిట్యూట్ లంచం కేసులో వెలుగులోకి..

ఈ స్కాం దర్యాప్తు రాయపూర్‌లోని శ్రీ రావతపురా సర్కార్ మెడికల్ ఇన్స్టిట్యూట్‌లో జరిగిన లంచం కేసుతో మొదలైంది. తనిఖీల సమయంలో అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి రూ. 55 లక్షలు లంచం తీసుకున్న ముగ్గురు డాక్టర్లు సహా ఆరుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. దర్యాప్తు లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండోర్, గుర్గావ్, రాజస్థాన్, వరంగల్, విశాఖపట్నం కేంద్రంగా జాతీయ మాఫియా నెట్‌వర్క్‌గా మారింది. డిల్లీ కేంద్రంగా ఉన్న ఆరోగ్య శాఖ అధికారులు తమ వద్ద ఉన్న అంతర్గత ఫైళ్లను ఫోటోలు తీయడం ద్వారా ఏజెంట్లకు పంపించి, కళాశాల యాజమాన్యాలను ముందుగానే అప్రమత్తం చేసేవారు. ముఖ్యంగా (MARB) మాజీ సభ్యుడు జితు లాల్ మీనా లంచాల లో కీలకంగా వ్యవహరించి, తన ప్రభావాన్ని ఉపయోగించి కోట్ల రూపాయలు వసూలు చేశాడని (FIR)లో పేర్కొన్నారు. ఈ నిధులతో రాజస్థాన్‌లో రూ. 75 లక్షల వ్యయంతో హనుమాన్ ఆలయం కూడా నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

దక్షిణాది రాష్ట్రాల మాపియా

ఈ స్కాంలో దక్షిణాది రాష్ట్రాల్లోని మాఫియా కూడా పాల్గొన్నట్లు సీబీఐ నిర్ధారించింది. కడిరికి చెందిన బి. హరి ప్రసాద్, హైదరాబాద్‌కు చెందిన అంకం రాంబాబు, విశాఖపట్నం‌కు చెందిన కృష్ణ కిషోర్ (NMC) తనిఖీల సమయంలో డమ్మీ ఫ్యాకల్టీ, నకిలీ రోగులను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి కృష్ణ కిషోర్ రూ. 50 లక్షలు వసూలు చేశాడు. ఫాదర్ కొలంబో మెడికల్ ఇన్స్టిట్యూట్ (వరంగల్) వంటి కొన్ని సంస్థలు నాలుగు కోట్ల రూపాయలకు పైగా చెల్లించి అనుమతులు పొందినట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 40కి పైగా మెడికల్ కాలేజీలు లంచం, నకిలీ ఆధారాలు, తారుమారు చేసినట్లు తనిఖీల్లో గుర్తించారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఒక్కరే అరెస్టు అయినా మరింత మంది త్వరలోనే అరెస్టయ్యే అవకాశం ఉంది.

Next Story