అమెరికా ఎటాక్.. ఇరాక్‌‌లో 16 మంది మృతి.. ఇరాక్ అల్టిమేటం

by Dishanational4 |
అమెరికా ఎటాక్.. ఇరాక్‌‌లో 16 మంది మృతి.. ఇరాక్ అల్టిమేటం
X

దిశ, నేషనల్ బ్యూరో : అమెరికా చెప్పినంత పని చేసి చూపించింది. జోర్దాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జనవరి 28న జరిగిన సూసైడ్ డ్రోన్ దాడిలో సంభవించిన సైనికుల మరణాలకు ప్రతీకారాన్ని తీర్చుకుంది. శనివారం ఉదయం సిరియా సరిహద్దు ప్రాంతంతో పాటు ఇరాక్‌ పశ్చిమ ప్రాంతంలోని ఇరాన్ సమర్ధిత మిలిటెంట్ గ్రూపులపై భీకర వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల వల్ల ఇరాక్‌లో 16 మంది చనిపోగా, 23 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో సామాన్య పౌరులు కూడా ఉన్నారని ఇరాక్ ప్రభుత్వ ప్రతినిధి బస్సెమ్ అల్ అవాది తెలిపారు. ఆకాషాత్, అల్ ఖైమ్ ప్రాంతాలలో ఉన్న ఇరాకీ సైనిక దళాలున్న ప్రాంతాలపైనా అమెరికా బాంబులు, క్షిపణులు పడ్డాయని ఆయన వెల్లడించారు. ఈ దాడులు చేయడానికి ముందు తమకు అమెరికా ఎలాంటి సమాచారాన్ని అందించలేదని ఇరాక్ సర్కారు స్పష్టం చేసింది. ఇతర దేశాలపై ఈవిధమైన దాడులు చేయడం ద్వారా అంతర్జాతీయ చట్టాలను అమెరికా ఉల్లంఘించిందని ఆరోపించింది. తమ దేశంలోని సైనిక స్థావరాలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని అమెరికాకు ఇరాక్ మరోసారి అల్టిమేటం ఇచ్చింది. అమెరికా చేష్టల వల్ల ఇరాక్‌లో భద్రత, స్థిరత్వం ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ దాడులపై అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ స్పందిస్తూ.. ‘‘ఇది ఆరంభం మాత్రమే’’ అని చెప్పారు. ఇరాక్, సిరియాలలో ఏడుచోట్ల ఉన్న ఇరాన్ సమర్ధిత మిలిటెంట్ గ్రూపుల 85 స్థావరాలపై దాడులు చేశామని వెల్లడించారు. ఈ దాడుల సందర్భంగా మిలిటెంట్ గ్రూపులకు చెందిన కమాండ్ కంట్రోల్ సెంటర్లు, రాకెట్, క్షిపణి, డ్రోన్ స్టోరేజీ సైట్లతో పాటు ఇంటెలిజెన్స్ స్థావరాలను అమెరికా వాయుసేన పేల్చేసింది. సుమారు 30 నిమిషాల పాటు ఈ వైమానిక దాడులు కొనసాగాయి.

Next Story

Most Viewed