దాడి చేశారో.. ఖబడ్దార్.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్

by Dishanational4 |
దాడి చేశారో.. ఖబడ్దార్.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు ఏర్పడ్డాయి. జనవరి 28న జోర్డాన్ బార్డర్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడే ఈ పరిస్థితికి కారణం. ఆ దాడిలో దాదాపు 8 మంది అమెరికా సైనికులు చనిపోగా, 30 మందికి గాయాలయ్యాయి. ఇరాక్‌లోకి ఇరాన్ మద్దతు కలిగిన మిలిటెంట్ గ్రూపు ఈ దాడికి పాల్పడిందని వెల్లడైంది. ఈ విషయం తెలిసినప్పటికీ అమెరికా అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. అగ్రరాజ్యం అనే ట్యాగ్‌కు న్యాయం చేసేందుకుగానూ ఇరాన్‌పై దాడికి అమెరికా సమాయత్తం అవుతోందనే వార్తలు వస్తున్నాయి. అమెరికా మిలిటరీ బేస్‌పై దాడికి పాల్పడిన ఇరాన్ సమర్ధిత మిలిటెంట్ గ్రూపుపై ప్రతీకార దాడులు చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ, రక్షణ శాఖ ఇప్పటికే ప్రకటించాయి. తాము చేయబోయే ఎటాక్‌ను కేవలం ప్రతీకార దాడిగానే చూడాలని ఇరాన్‌ను ఒక థర్డ్ పార్టీ దేశం ద్వారా అమెరికా కోరిందట. తమ దాడికి స్పందించకుండా ఉండాలని ఇరాన్‌కు సూచించిందట. ఈనేపథ్యంలో తాజాగా బుధవారం ఇరాన్ ఘాటుగా స్పందించింది. ‘‘ఇరాన్‌పై కానీ.. ఇరాన్ అవతల ఉన్న ఇరాన్ పౌరులు, ఆస్తులపై కానీ ఏదైనా జరిగితే తప్పకుండా ప్రతిఘటిస్తాం.. ప్రతిస్పందిస్తాం.. తగిన సమాధానం ఇచ్చి తీరుతాం’’ అని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ వెల్లడించారు. జనవరి 15న ఇరాక్‌లోని కుర్దిస్తాన్ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెలీ గూఢచర్య సంస్థ మోసాద్ ప్రధాన కార్యాలయంపైనా ఇరాన్ మిస్సైల్ ఎటాక్ చేసింది.

Next Story

Most Viewed