కెనడాపై ఆసక్తి చూపని భారత విద్యార్థులు: 86 శాతం తగ్గిన దరఖాస్తులు

by Dishanational2 |
కెనడాపై ఆసక్తి చూపని భారత విద్యార్థులు: 86 శాతం తగ్గిన దరఖాస్తులు
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యపై భారత్-కెనడాల మధ్య దౌత్యపరమైన వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కెనడాకు వెళ్లేందుకు భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపనట్టు తెలుస్తోంది. గతేడాది కెనడా జారీ చేసిన అనుమతుల సంఖ్య భారీగా తగ్గింది. అంతకుముందు త్రైమాసికంలో 1,08,940 మందికి అనుమతులివ్వగా.. గతేడాది డిసెంబర్‌లో 14,910 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చామని, సుమారు 86శాతానికి పడిపోయినట్టు కెనడా మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడమే దీనికి కారణమని చెప్పారు. దీని వల్ల భారత విద్యార్థులు కెనడాకు బదులుగా వేరే దేశానికి వెళ్లేందుకు ఆసక్తి చూపినట్టు వెల్లడించారు. గత కొన్నేళ్లలో కెనడాలో భారతీయులు అతిపెద్ద సంఖ్యలో ఉన్నారు. 2022లో కెనడాలో 2, 25,835 మంది విద్యార్థులు ఉండగా.. అందులో 41శాతం భారత విద్యార్థులే. కానీ ప్రస్తుతం ఈ సంఖ్య గణనీయంగా తగ్గడం గమనార్హం. కాగా, నిజ్జర్ హత్యకు సంబంధించి భారతీయ ఏజెంట్లకు సంబంధించిన ఆధారాలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చెప్పడంతో దౌత్యపరమైన ఉద్రిక్తతలు చెలరేగాయి. దీంతో భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు కెనడా ప్రభుత్వం 41 మంది దౌత్య వేత్తలను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. మరోవైపు 2023లో కెనడాలో దాదాపు 9,00,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. ఇది దశాబ్దం క్రితం కంటే మూడు రెట్లు ఎక్కువ. ఆ విద్యార్థులలో 40 లేదా దాదాపు 360,000 మంది భారతీయులు ఉన్నట్టు మిల్లర్ వెల్లడించారు.


Next Story