ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీత సాక్షిగా ప్రమాణం

by Dishanational4 |
ఆస్ట్రేలియా పార్లమెంటులో  భగవద్గీత సాక్షిగా ప్రమాణం
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ ఆస్ట్రేలియా పార్లమెంటులోని సెనేట్ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఆయన భగవద్గీతపై ప్రమాణం చేసి సెనేట్ సభ్యుడిగా బాధ్యతలను చేపట్టారు. వరుణ్‌ను పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్రం నుంచి సెనేట్‌కు నామినేట్ చేశారు. ‘‘నేను ఉన్నత విద్యను అభ్యసించాను. నాలాగే ప్రతి ఒక్కరికీ ఉన్నత విద్య, నాణ్యమైన విద్య అందాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’’ అని ఈసందర్భంగా వరుణ్ తెలిపారు. వరుణ్ ఘోష్ పెర్త్ నగరంలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆయన 17 సంవత్సరాల వయస్సులోనే భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వలస వెళ్లారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా యూనివర్సిటీ నుంచి ఆర్ట్స్ అండ్ లా కోర్సులో డిగ్రీ చేశారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో కామన్వెల్త్ స్కాలర్‌గా కూడా వ్యవహరించారు. గతంలో వాషింగ్టన్‌లో ప్రపంచ బ్యాంకు సలహాదారుడిగా, న్యూయార్క్‌లో ఫైనాన్స్ అటార్నీగా సైతం కీలక బాధ్యతలను నిర్వర్తించారు. ఆస్ట్రేలియాలోని లేబర్ పార్టీలో చేరడం ద్వారా ఆయన తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2019లో జరిగిన ఫెడరల్ ఎన్నికలలో పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి లేబర్ పార్టీ తరఫున పోటీ చేసిన ఘోష్ ఐదో స్థానంలో నిలిచారు. ఈసారి మాత్రం ఆయన మొదటి ప్లేసులో నిలవడంతో సెనేట్‌కు ఎంపికయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ ట్వీట్ చేస్తూ.. ‘‘పశ్చిమ ఆస్ట్రేలియా నుంచి ఎన్నికైన మా కొత్త సెనేటర్ వరుణ్ ఘోష్‌కు స్వాగతం. ఆయన చేరికతో మా టీమ్ మరింత బలోపేతం అవుతుందని నమ్ముతున్నాం’’ అని చెప్పారు.


Next Story